Dattatreya Jayanti : మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటారు. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశంతో దత్తాత్రేయుడు జన్మించాడు. సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు. అత్రి మహా తపస్సంపన్నుడు. అత్రికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. అనసూయ మహా పతివ్రతగా పేరు తెచ్చుకుంటుంది
భారతదేశంలో తెలుగు రాష్ర్టాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో దత్త సంప్రదాయం విస్తారంగా విరాజిల్లింది. దత్తాత్రేయుల అవతారం పరంపరగా కొనసాగటం విశేషం. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు తెలుగు ప్రాంతంలో జన్మించటం మన పుణ్యఫలం. శ్రీపాదుడు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఆవిర్భవించాడు. మానవులలో పేరుకుపోయిన మనోమాలిన్యాలను, పూర్వపాపాల సంచిత కర్మలను తన స్మరణ మాత్రం చేత తొలగించి, ధన్యతను ప్రసాదించే పుణ్యమూర్తి శ్రీవల్లభుడు.
దత్తాత్రేయుని రెండో అవతారం శ్రీనరసింహ సరస్వతి. అంబ అనే భక్తురాలికి కుమారుడుగా జన్మిస్తానని శ్రీపాదులు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఆవిర్భవించిన అవతారమిది. దత్తాత్రేయుని మూడో అవతారం మాణిక్యప్రభువు.. దత్తుని మరో రెండు అవతారాలు అక్కల్కోట మహారాజు, శిరిడీ సాయిబాబా. వీరి నుంచి దత్తావతారులు అవధూత మార్గాన్ని అనుసరించటం ఆరంభమైంది.
తెలుగు రాష్ట్రాల్లో దత్తాత్రేయుడుకి అనేక చోట్ల దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది మాచర్ల దగ్గర ఎత్తి పోతలలో కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలో వల్లభాపురం గ్రామంలో వెలసిన మహిమాన్వితమైన దత్తాత్రేయ క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయం కూడా ప్రసిద్ధి చెందింది.