Will KCR and jagan Attend Assembly Session: ఆన్ రికార్డ్ ఉండాలన్నా.. ప్రజా సమస్యలపై ప్రస్తావించాలన్నా.. అందుకు వేదిక అసెంబ్లీనే. అలాంటి అసెంబ్లీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఏపీలో ఇప్పటికే సభ ప్రారంభమైంది. తెలంగాణలో 23 నుంచి బడ్జెట్ సెషన్ మొదలవుతోంది. మరి మొన్నటిదాకా సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్ ఇప్పుడు పూర్తిస్థాయిలో సభా సమరంలో పూర్తిగా పాల్గొంటారా..? ప్లాన్ బి తో పక్కకు తప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జగన్ ఢిల్లీలో ధర్నాల పేరు చెప్పి.. సెషన్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. మరి సభలో గర్జిస్తానన్న మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నట్లేనా?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. అయితే ఈసారి హైవోల్టేజ్ పొలిటికల్ హీట్ ఉండబోతోందా అన్న చర్చ జరుగుతోంది. ఓవైపు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీకి పలుమార్లు వెళ్లి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి.. పలు అంశాలపై కేంద్రానికి వినతిపత్రాలు ఇచ్చి వచ్చారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని చెప్పి వచ్చారు. కాబట్టి ఎక్కడా ఇబ్బంది రాకుండా, బడ్జెట్ లెక్కల విషయంపై అణువణువూ జాగ్రత్తతో ఉంటున్నారు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ సహా ఇచ్చిన హామీలన్నిటిపైనా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. నిధుల సర్దుబాట్లు చేస్తున్నారు. కాబట్టి లెక్కలు ఇలా ఉంటే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కామన్ గానే కనిపిస్తుంటుంది. అయితే ఈసారి అది మరింత హైవోల్టేజ్ కింద మారబోతోందన్న టాక్ నడుస్తోంది.
మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లే అయి.. నిరసనల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ సభలో స్లోగన్స్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత వాకౌట్ చేశారు. ఇక సభలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు జగన్ ఇష్టపడడం లేదని, అందుకే గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడం, రాజకీయాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారంటున్నారు. అసలు సభలో భవిష్యత్ లో జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటి?
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి అనే కంటే వైసీపీ నిరసనలతో స్టార్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. సంఖ్యాబలం తక్కువే ఉన్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్న టాపిక్ తో వైసీపీ స్పీడ్ పెంచింది. అయితే మాజీ సీఎం జగన్ కు సభలో విపక్ష సీటులో కూర్చునేందుకు మనసు ఒప్పడం లేదని అధికార పార్టీ నేతలు పదే పదే డైలాగ్ విసురుతున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 40 రోజులు కాకముందే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. 5 రోజులు జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొద్దన్న ఉద్దేశంతోనే ఢిల్లీలో నిరసనలకు ప్లాన్ చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.
Also Read: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. మాజీ సీఎం కేసీఆర్ వస్తారా?
మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా కనిపించింది. మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. సేవ్ డెమొక్రసీ, రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నశించాలి.. అని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కుని చింపేశారు. ఆ అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులను నిలదీశారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగదని.. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమని, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదన్నారు జగన్.
చట్ట ప్రకారం పోలీసులు పని చేయాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చించివేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. పోలీసుల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేసిన జగన్ సభలో కూడా సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయని నినాదాలు చేశారు. ఆ తర్వాత వైసీపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదంతా ముందస్తు వ్యూహమే అని, సభలో విపక్ష సీట్లలో కూర్చునే ఉద్దేశం లేకనే ఏవో ఒక సాకులు చెబుతున్నారన్నారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని చెబుతూ ఢిల్లీలో బుధవారం వైసీపీ ధర్నాకు ప్లాన్ చేసింది. దీంతో 23నే అంతా ఢిల్లీకి చేరుకోవాలని మాజీ సీఎం జగన్ ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులను ఆదేశించారు.
బుధవారం ధర్నా చేశాక.. గురు, శుక్రవారాల్లోనూ జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మూడు శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనుంది. శుక్రవారంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి. అంటే మొత్తం సమావేశాలకు హాజరు కాకుండా ఉండే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. మాజీ సీఎం జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మధ్య సంభాషణ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసిన జగన్.. జులై 21న గవర్నర్ ను కలిశారు.
Also Read: చిక్కుల్లో ఐఏఎస్ స్మిత సబర్వాల్, పోలీసుస్టేషన్లో ఫిర్యాదు
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. టీడీపీ అరాచకాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కేంద్రానికి సిఫారసు చేయాలని గవర్నర్ను కోరారు. అటు జగన్ వ్యవహార శైలిపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎవరు హింసాకాండకు పాల్పడినా ఉక్కుపాదంతో అణచివేస్తామని, శాంతిభద్రతల్ని కాపాడటంలో రాజీ పడబోమని చంద్రబాబు అంటున్నారు. శాంతిభద్రతల్ని స్వయంగా పర్యవేక్షిస్తానని క్లారిటీ ఇస్తున్నారు. ప్రజలు పూర్తిగా తిరస్కరించినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని, ఉనికి చాటుకోవడానికి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.
జగన్ ఫేక్ పాలిటిక్స్ను నమ్ముకున్నారని, అందుకే టీడీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడుతున్నారు. శాసనసభ సమావేశాలకు హాజరవకుండా ఉండేందుకే ఢిల్లీలో ధర్నా పేరుతో ఆయన డ్రామా చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. అటు ప్రభుత్వంపై బురద చల్లడానికే.. జగన్ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. ఏపీలో 4 పొలిటికల్ హత్యలు జరిగితే.. అందులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలే చనిపోయారన్న విషయాన్ని గుర్తు చేశారు. 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్ ఆరోపణలు చేయడం కంటే ముందు.. వివరాలుంటే హోంమంత్రిగా తనకు సమాచారం ఇవ్వాలన్నారు.