Goods Train Derails in Nellore(Andhra news today): ఆంధ్రప్రదేశ్లో మంగళవారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరులోని బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన తెల్లవారుజామున 5 గంటల సమయంలో జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.
నెల్లూరు జిల్లా గూడ్స్ రైలు ప్రమాదం జరగడంతో విజయవాడ వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో మరో రైలు రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగవచ్చని తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రస్తుతం ఘటన స్థలం వద్ద పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. బోగీలను తొలగించి సవరిస్తున్నారు. అయితే ఈ సమయంలో అత్యవసర రైళ్లను మాత్రం మూడో లైన్లో పంపించేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే బిట్రగుంట రైల్వే స్టేషన్ కు దక్షిణం వైపు ఉన్న 144వ లెవెల్ క్రాసింగ్ గేటు దగ్గర గూడ్స్ ఫార్మేషన్ ఆగడంతో రోడ్డు వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించి ఆ తర్వాత గూడ్స్ రైలు పట్టాలను పునరుద్దరిస్తున్నారు.