Sharmila: దాడి చేసినా.. అరెస్టు చేసినా.. తగ్గేదేలే అంటున్నారు వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల. టీఆర్ఎస్ నేతలపై మాటల తూటాలు ఆపేదేలే అంటూ మళ్లీ విమర్శలకు పదును పెట్టారు. ఈసారి నేరుగా మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారు.
మంత్రి హరీష్ రావు బోగస్ మాటలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల. ఉద్యమంలో హరీష్ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయినట్టు నాటకాలు ఆడారన్నారు. శ్రీకాంతాచారి అగ్గిపెట్టె తెచ్చుకొని అమరుడైతే.. హరీష్ అగ్గిపెట్టె మర్చిపోతే మంత్రి అయ్యాడని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోందని షర్మిల సెటైర్లు వేశారు.
కవితపైనా పంచ్ లు వదిలారు షర్మిల. కవితమ్మ అమాయకంగా బతుకమ్మ ఆడుతూనే లిక్కర్ స్కాంకి తెరలేపిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో నాటకానికి తెర లేపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం అంతా డ్రామాలు ఆడుతున్నారని.. వారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు.
కేసీఆర్ మాటల్లో ఉన్న చిత్తశుద్ది చేతల్లో కనపడడం లేదని తప్పుబట్టారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి అంబేడ్కర్ పేరు పెడితే కేసీఆర్ దాన్ని తీసేసారని గుర్తు చేశారు. రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ అంబేడ్కర్ని అవమానపర్చారని.. కేసీఆర్ చేసిన వాగ్ధానాలు నెరవేర్చడానికి రాజ్యాంగం అడ్డు వచ్చిందా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లో.. కే అంటే కొట్టి.. సీ అంటే చంపే.. ఆర్ అంటే రాజ్యాంగం.. అని షర్మిల సెటైర్లు వేశారు. ప్రజల కోసం నిలబడే వాళ్లని నల్లిని నలిపినట్టు నలిపేయాలని, మహిళ బట్టలు చింపాలి, పెట్రోల్ బాంబులతో దాడి చేయాలని కేసీఆర్ రాజ్యాంగంలో ఉందన్నారు.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లిబర్టీ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. పదిశాతం మందికి కూడా దళితబంధు ఇవ్వలేదని విమర్శించారు. తన అరెస్ట్ పట్ల సానుభూతి వ్యక్తం చేసిన అందరికీ థాంక్స్ చెప్పారు షర్మిల.