Russia: అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగినట్లు ప్రకటించిన తర్వాత రష్యా తొలిసారిగా స్పందించింది. అమెరికా రాజకీయాలు తమకు ముఖ్యం కాదని, ఉక్రెయిన్ యుద్ధ లక్ష్యాలను చేరుకోవడానికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. సొంత డెమొక్రాట్ పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఆ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్కే అధ్యక్ష అభ్యర్థిగా తాను మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ సుధీర్ఘ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఏం జరుగుతుందో మనం ఓపికగా పరిశీలిస్తూ ఉండాలి. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్పై చేస్తున్న స్పెషల్ మిలటరీ ఆపరేషన్ లక్ష్యాలను చేరుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది అని అన్నారు. తమ దేశంపై రష్యా దండయాత్రను ఉక్రెయిన్ యుద్ధంగా చెబుతుండగా రష్యా మాత్రం స్పెషల్ మిలటరీ ఆపరేషన్ అని చెప్పుకుంటోంది.
Also Read: అవినీతి కేసులో ఏకంగా దేశ ప్రధానికే సమన్లు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్కు పెద్ద మొత్తంలో ఆయుధాలను కూడా సమకూరుస్తోంది. ఈ క్రమంలో రష్యా, అమెరికా మధ్య విభేదాలు ముసురుకున్నాయి. మరోవైపు అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు మద్దతు ఉపసంహరిస్తామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు పరోక్షంగా చెప్పారు. కాగా ఈ నేపథ్యంలోనే బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రష్యా స్పందించడం గమనార్హం. మరోవైపు బైడెన్ వైదొలగడంపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ టెలిగ్రామ్ వేదికగా స్పందించారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. రష్యా ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ లక్ష్యాలు నెరవేరబోతున్నాయని వ్యాఖ్యానించారు.