Mega 157: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్పుడున్న కుర్ర హీరోలు.. ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఉండగా.. చిరు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు.
వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చిరు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఎప్పటినుంచో కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో చిరు ఇంకో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు అది కన్ఫర్మ్ అయ్యినట్లు టాక్. ఇప్పటికే ఈ కాంబోలో గాడ్ ఫాదర్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని చిరుకు అందించలేకపోయింది.
ఇక ఈసారి ఎలాగైనా చిరుకు గట్టి హిట్ ను ఇవ్వాలని మోహన్ రాజా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చెన్నై యమా స్పీడ్ గా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. ఈ చిత్రానికి BVS రవి కథను అందిస్తుండగా.. చిరు కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. అయితే గాడ్ ఫాదర్ రిజల్ట్ చూసాక కూడా మళ్లీ ఈ కాంబో అంటే మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి మెగా 157 ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.