Anagani Resonded on Madanapalle Incident: ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై ఆయన మాట్లాడారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే అనుమానం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో, ఉద్యోగుల ఫోన్లను సీజ్ చేసినట్లు చెప్పారు. అన్ని రెవెన్యూ ఆఫీసుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అనగాని వెల్లడించారు.
‘పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకు ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దిరెడ్డి రూ. 1000 కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొన్నటివరకు సబ్ కలెక్టరేట్ ఆయన నియంత్రణలోనే ఉండేది. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ల్యాండ్ కన్వర్షన్ జరిగింది. ఈ విషయమై ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించగానే ఈ ఘటన జరిగింది. ఆదివారం రోజు ఉద్యోగులు పనిచేయడం ఎందుకు.? ఉద్యోగులు సక్రమంగా పనిచేయలేకపోతే పక్కకు తప్పుకోవాలి. గత ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవు’ అంటూ మంత్రి హెచ్చరించారు.
Also Read: ఇంతకీ నీ భర్త ఎవరో చెప్పు.. శాంతికి దేవాదాయశాఖ నోటీసులు
కాగా, ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లెకు చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. డీజీపీతోపాటు సీఐడీ చీఫ్ రవిశంకర్ కూడా సంఘటనాస్థలికి వెళ్లారు.