Rain Alert for Telangana: వాతావరణ కేంద్రం తాజాగా కీలక సూచన చేసింది. రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైందని పేర్కొన్నది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్తున్న కొద్ది ఆగ్నేయం వైపు వంగి ఉందని, రుతుపవన ద్రోణి నేడు జైసల్మేర్, అజ్మీర్, గుణ, తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై అల్పపీడనం మీదుగా వెళ్తుందని తెలిపింది. తూర్పు – మధ్య బంగాళాఖాతం వరకు సగటున సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని వివరించింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. రాగల మూడు రోజులపాటు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది.
Also Read: స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై దుమారం.. ట్వీట్ ను సమర్థించుకున్న అధికారిణి
ఈ క్రమంలో.. ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. జిల్లాల్లో ఏ విధమైన ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగానే పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్ తోపాటు పలు శాఖలతో సమన్వయంతో పనిచేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.