Shanthi Controversy: సస్పెండెడ్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది. నిన్నటి వరకూ ఆమె మూడో బిడ్డకు తండ్రెవరన్న దానిపై చర్చ జరిగింది. ఆ బిడ్డ తన బిడ్డ కాదని మొదటి భర్త మదన్ మోహన్ చెప్తున్నాడు. శాంతికి తనకు పెళ్లే కాలేదని.. సుభాష్ అంటున్నాడు. మానవత్వంతో ఆమె డెలివరీ ఫైల్ పై సంతకం చేశానే తప్ప.. ఆ బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొద్దిరోజుల క్రితమే బాంబు పేల్చాడు. మరి ఆ బిడ్డకు తండ్రెవరన్న దానిపై సందిగ్ధం వీడలేదు.
శాంతిపై ఆరోపణలు రావడంతో జూలై 2న సస్పెండ్ చేసి 9 అభియోగాలు నమోదు చేశారు. తాజాగా.. ఆమెపై మరో 6 అభియోగాలు నమోదయ్యాయి. అసలు తన భర్తెవరో చెప్పాలని పేర్కొంటూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతి ప్రవర్తన.. ఆ శాఖ తీరుకే భంగం కలిగించిందన్నారు. ఇటీవల శాంతి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్ గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలపై 6 అభియోగాలను మోపారు.
2020 సంవత్సరంలో ఆమె ఉద్యోగంలో చేరినపుడు భర్త పేరు కె. మదన్ మోహన్ అని సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయించారని తెలిపారు. గతేడాది మెటర్నిటీ లీవ్ పెట్టినపుడు కూడా భర్తపేరు మదన్ గానే పేర్కొన్నారన్నారు. కానీ 17న నిర్వహించిన మీడియా సమావేశంలో సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారని, విడాకులు తీసుకోకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధమన్నారు. దీనిపై 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులిచ్చారు.
Also Read : శాంతికి పుట్టిన మగబిడ్డ ఎవరికి పుట్టాడో తేల్చాలి: భర్త మదన్
దేవాదాయశాఖ ప్రతిష్టకు భంగం కలిగించారని 2వ అభియోగం, కమిషనర్ అనుమతి లేకుండా మీడియా సమావేశంలో మాట్లాడటంపై మూడో అభియోగం, ఎప్పుడెలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్, పార్టీకి మీరు వెన్నెముక అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గతేడాది మే28న ట్వీట్ చేయడం పార్టీతో ఉన్న అనుబంధాన్ని చూపిస్తోందని, ఇది ప్రభుత్వ ఉద్యోగి నిబంధనలకు విరుద్ధమంటూ మరొక అభియోగం మోపారు.
విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్ మెంట్ లోని మరో ప్లాట్లో ఉన్నవారితో గొడవ పడటంపై 2022 ఆగస్టులో ఆరిలోవ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరారు. అధికారం లేకపోయినా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న అనకాపల్లి సిద్ధేశ్వరస్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వరాలయం, హార్డేంజ్ రెస్ట్ హౌస్, లంకలపాలెం పరదేశమ్మ ఆలయం, పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయం, ధారపాలెం ధారమల్లేశ్వరస్వామి ఆలయాలకు చెందిన షాపులు, భూముల లీజులను 11 ఏళ్లకు రెన్యువల్ చేసేలా ప్రతిపాదనలు పంపడం, రెన్యువల్ కావడంపై వివరణ కోరుతూ నోటీసులిచ్చారు. వీటన్నింటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.