AP Weather: మళ్లీ తుపాను హెచ్చరిక. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచన. సముద్రంలో చేపల వేటకు వెళ్లొదన్ని ఆదేశం. మూడు రోజుల పాటు తుపాను ప్రభావం ఉంటుందనేది వెదర్ రిపోర్ట్.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి.. వాయుగుండంగా మారనున్నట్టు భారత వాతావరణ విభాగం-ఐఎండీ తెలిపింది. వాయువ్య దిశగా కదులుతూ కోస్తాంధ్ర-తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తోంది. 8వ తేదీ ఉదయానికి మరింత బలపడి తుపానుగా మరే అవకాశం ఉందని ఐఎండీ అంచనా.
తుపానుగా మారిన తర్వాత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో 7వ తేదీ సాయంత్రం నుంచి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. 8 నుంచి 10వ తేదీ వరకు దక్షిణ కోస్తా, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 7 నుంచి 10వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
తుపాను ముప్పును ఎదుర్కోవడానికి తీర ప్రాంతాల్లోని రెవెన్యూ యంత్రాంగాన్ని ఏపీ విపత్తు నిర్వహణసంస్థ అప్రమత్తం చేసింది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని.. సత్వర సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.