Nipah Virus: కేరళలోని కోజికోడ్ నగరంలో నిపా వైరస్ సోకిన ఓ 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఆదివారం జరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. చనిపోయిన బాలుడికి నిపా వైరస్ ఉన్నట్లు అతని రక్త నమూనా పరీక్షలో తేలిందని పుణెకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారణ చేసింది.
కేరళ ఆరోగ్య మంత్రి వీణా మాట్లాడుతూ.. పండిక్కడ్ కు చెందిన ఆ బాలుడికి ఆదివారం ఉదయం 10.50 గంటలకు గుండెపోటు సమస్య వచ్చింది. డాక్టర్లు అతడిని కాపాడడానికి 40 నిమిషాలపాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ బాలుడు 11.30 గంటలకు చనిపోయాడని డాక్లర్లు తెలిపారు. నిపా వైరస్ పాటిటవ్ అని తేలడంతో ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ విషాదం జరిగింది.
ఆస్పత్రిలో నిపా వైరస్ కారణంగా బాలుడికి శ్వాస తీసుకోవడంలో సమస్యగా ఉండడంతో అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందించేవారు. పైగా చనిపోయే ఒక రోజు ముందు నుంచి బాలుడికి మూత్రం రావడం లేదని డాక్టర్లు తెలిపారు.
నిపా వైరస్ గురించి వివరాలు:
జంతువుల నుంచి మనుషులకు సోకే జూనాటిక్ వైరస్ జాతికి చెందిన నిపా వైరస్.. కొన్ని సందర్భాల్లో ఒక మనిషి నుంచి మరో మనిషి వ్యాప్తి చెందుతుంది. అలా కలుషితమైన ఆహారం, వ్యాధి సోకిన మనుషులతో చేతులు కలపడం ద్వారా మరొకరికి సోకే అవకాశం ఉంది.
Also Read: దారుణం.. బతికుండగానే మహిళలను పూడ్చేందుకు యత్నం!
1999లో మలేసియాలోని సుంగాయ్ నిపా అనే గ్రామంలో ఈ వైరస్ ని తొలిసారి గుర్తించారు. అప్పటి నుంచి ఆ గ్రామం పేరుమీదే నిపా వైరస్ అని నామకరణం చేశారు. నిపా వైరస్ మనుషులలో ఉన్న పారా ఇన్ఫ్లూయెన్జా వైరస్ లాంటిది. అంటే మనుషులలో జలుబు విపరీతంగా మారి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండే వైరస్ల కోవలో నిపా వైరస్ కూడా ఒకటి. ఈ వైరస్ ఎక్కువగా ఫ్రూట్ బ్యాట్, ఫ్లయింగ్ ఫాక్స్ అనే గబ్బిలాలలో ఎక్కువగా ఉంటుంది. ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయ ల్యాండ్, వియత్నామ్ లాంటి సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలలో ఈ జాతికి చెందిన గబ్బిలాలు ఎక్కువగా ఉంటాయి.
ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అన్ని నిపా వైరస్ కేసుల బాధితులందరికీ ఈ గబ్బిలాల ద్వారాలనే వైరస్ వ్యాప్తి చెందిందని పరిశోధన్లో తేలింది.
కేరళలో నిపా కేసులు
కేరళలోని కోజికోడ్ జిల్లాలో 2018, 2021, 2023 సంవత్సరాలలో అలాగే ఎర్నాకులం జిల్లాలో 2019 సంవత్సరంలో నిపా వైరస్ కేసులు బయటపడ్డాయి. 2018లో మొదటిసారి వైరస్ వల్ల కేరళలో 17 మంది చనిపోగా, 2023లో ముగ్గురు చనిపోయారు. కేరళలోని కోజికోడ్, వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకులం జిల్లాలోని గబ్బిలాలను పరిశోధన చేయగా వాటిలో నిపా వైరస్ యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది.