IT Raids: హైదరాబాద్, వంశీరామ్ బిల్డర్స్ పై ఐటీ రైడ్స్. విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇంట్లోనూ ఐటీ దాడులు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపైనా ఐటీ పంజా. ఉక్కసారిగా అంతా అటెన్షన్. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాలపై సర్వత్రా చర్చ.
ఇదేంటి యావత్ దేశం ప్రశాంతంగా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈడీ, ఐటీ, సీబీఐ హడావుడి ఏంటి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు జరగవా? అనే ప్రశ్న. తెలంగాణలో జాతీయ సంస్థల అలజడికి రాజకీయ కారణాలే కారణమనే విమర్శ. మరి, ఏపీలోనూ వరుస దాడులు దేనికి సంకేతం? తెలంగాణ, ఏపీ.. రెండు తెలుగు రాష్ట్రాలూ కేంద్రం, బీజేపీ టార్గెట్ లో ఉన్నాయా? ఎన్నికలకు ఏడాది గడువు మాత్రమే ఉండటంతో.. ఐటీ, ఈడీ, సీబీఐ హల్చల్ మొదలైందా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ సంస్థలు చేస్తున్న ప్రతీ దాడిలోనూ బీజేపీయేతర రాజకీయ నేతల ప్రమేయం ఉంటుండటం ఆసక్తికరం. అంటే, పక్కా టార్గెటెడ్ గానే ఈ రైడ్స్ జరుగుతున్నాయా? తెలంగాణలో గంగుల కమలాకర్, రవిచంద్ర, తలసాని బ్రదర్స్, మల్లారెడ్డిలపై జాతీయ సంస్థలు పంజా విసరగా.. ఇప్పుడిక ఏపీ వంతు వచ్చినట్టుంది. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో చేర్చడం.. చంద్రబాబు హయాంలో 2014-2019 మధ్య ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన స్కాప్ పై ఈడీ దృష్టి పెట్టి చంద్రబాబు సన్నిహితులకు సీబీఐ నోటీసులు ఇవ్వడం.. తాజాగా దేవినేని అవినాశ్, వల్లభనేని వంశీలపై ఐటీ దాడులు జరగడం.. ఇవన్నీ చూస్తుంటే తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ఏదో వ్యూహం అమలు చేస్తోందనే అంటున్నారు. మోదీ వచ్చే ముందు ఈడీ, ఐటీ, సీబీఐ వస్తుందంటూ ఇటీవల కవిత చేసిన డైలాగ్ ప్రస్తుత పరిస్థితిలో నిజమే అనిపిస్తోందని చెబుతున్నారు.
తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అందుకే ఈ దూకుడు అనుకోవచ్చు. మరి, ఏపీపైనా కమలనాథులు కన్నేశారా? అంటే అవుననే అంటున్నారు. మొయినాబాద్ ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వీడియో రికార్డింగ్స్ లోనూ ఏపీ ప్రస్తావన వచ్చింది. తెలంగాణ తర్వాత తమ నెక్ట్స్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆ ముగ్గురు మధ్యవర్తులు చెప్పినట్టు ఉంది. వైసీపీ, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వారు అన్నారు. అదే నిజమైతే.. ఆంధ్రప్రదేశ్ పై లోటస్ ఆపరేషన్ ఇప్పటికే మొదలైపోయిందా? తాజా పరిణామాలు అందుకు నిదర్శనమా? పవన్ కల్యాణ్ యాక్టివ్ కావడం.. విశాఖలో మోదీ, జనసేనాని మీటింగ్ తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నట్టు ఉన్నాయి. తెర వెనుక, ఢిల్లీ స్థాయిలో ఏదో జరుగుతోందని అనిపిస్తోంది.
దక్షిణాదిలోకి కమలం పార్టీ దూసుకొచ్చేందుకు.. తెలంగాణ, ఏపీల్లో రూట్ క్లియర్ చేసే కార్యక్రమం చేపట్టిందా? ముందు జాతీయ దర్యాప్తు సంస్థలను పంపించి.. ప్రాంతీయ పార్టీల నేతలను భయభ్రాంతులకు గురి చేసి.. ఆ కల్లోలంలో కమల వికాసం జరిగేలా.. బీజేపీ తన పేటెంట్ వ్యూహాన్ని అమలు చేస్తోందంటూ బాధిత పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. తప్పు చేస్తే దాడులు చేయరా? అంటూ కమలనాథులు ఎంతగా కవర్ చేసుకోవాలని చూసినా.. మరి, బీజేపీ నేతలెవరూ వ్యాపారాలు చేయట్లేదా? అందులో లొసుగులు లేవా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవంటూ నిలదీస్తున్నారు.