Braj mandal yatra haryana updates(Telugu news live today):
హర్యానా రాష్ట్రంలో నుహ్ జిల్లాలో ఏటా బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది..విశ్వహిందూ పరిషత్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా అక్కడ 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. జులై 22 (సోమవారం)న జరిగే ఈ జలాభిషేక యాత్ర శాంతియుతంగా జరిపేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది హర్యానా ప్రభుత్వం. గత ఏడాది నుహ్ జిల్లాలో నిర్వహించే బ్రజ్ మండల్ జలయాత్ర కార్యక్రమం హింసాత్మకంగా మారింది.హఠాత్తుగా ఓ వర్గం వారు వీరిపై రాళ్లతో దాడి చేశారు. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రతిదాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో అమాయకులైన ఇద్దరు హోం గార్డులు, ఓ మత పెద్ద, మరికొందరు పౌరులు మృతి చెందారు. దానితో బీజేపీ శ్రేణులు హర్యానా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
సర్కార్ వైఫల్యంపై ఫైర్
ఇదంతా ప్రభుత్వం చేతకానితనం వలనే జరిగిందని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.
జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి భద్రతా ఏర్పాట్లు మరింత విస్తృతం చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం దాకా నూహ్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. అలాగే బల్క్ ఎస్ఎమ్ఎస్ ల మీదకూడా నిషేధాజ్ణలు అమలు చేశారు. ఎవరైనా పుకారు వార్తలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఎలాంటి వదంతులూ నమ్మ వద్దని అంటున్నారు.ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసినా, ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా ప్రవర్తించినా వాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామని హర్యానా హోమ్ శాఖ కార్యదర్శి తెలిపారు. గత ఏడాది జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు శాఖను కోరింది.
సున్నిత ప్రాంతాలపై నిఘా
అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ముఖ్యంగా సున్నిత ప్రదేశాల వద్ద పోలీసు బందోబస్తు ఎక్కువ చేశారు. ఎక్కడైతే మసీదులు ఉన్నాయో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాల ద్వారా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాస ఆరంభంలో బ్రజ్ మండల్ యాత్ర జరిపిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటారు. హరహర మహాదేవ అంటూ శివలింగానికి జలాభిషేకం నిర్వహిస్తారు. గతేడాది గుర్ గ్రావ్ ప్రాంతంలో ఓ మసీదుపై దాడి చేసి అక్కడి మత పెద్దను హత్య చేయడంతో తీవ్రస్థాయిలో ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. దాదాపు 15 రోజుల పాటు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ, 144 సెక్షన్లు అమలు చేశారు. అలాంటి దురదృష్ట కర సంఘటనలు చెలరేగకుండాఈ సారి ముందుగానేపోలీసులు అప్రమత్తమవడం గమనార్హం.