Ujjaini Mahankali Rangam Bhavishyavani(Telangana news live): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలు రెండోరోజు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సకలదేవతల పూజలతో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
ఈ ఏడాది బోనాలను సంతోషంగా అందుకున్నానని తెలిపారు. భక్తులందరినీ తన వద్దకు రప్పించుకున్నానన్నారు. ఏ ఆపద రాకుండా తనను కొలిచినవారికి అండగా నిలుస్తానని అభయమిచ్చారు. మామూలు బోనమైనా, మట్టిబోనమైనా, స్వర్ణబోనమైనా.. ఆ బోనాన్ని ఎవరు ఎత్తుకుని తీసుకొచ్చినా తనకు సంతోషమేనన్నారు. ఇలా చేయాలి, అలా చేయాలన్నవి పెట్టుకోవద్దన్నారు మాతంగి స్వర్ణలత.
ఈ ఏడాది కోరినన్ని వర్షాలు పడుతాయని, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని రంగం భవిష్యవాణిలో వినిపించారు. అందరూ సంతోషంగా జీవించాలని అన్నారు. ఏది ఎంతవరకు కావాలో అంతవరకే కోరుకోవాలని చెప్పారు. కష్టంలేకుండా తన దర్శనం జరిగితే.. భక్తులు సోమరిపోతులవుతారని అన్నారు. భక్తులకు ఎలాంటి రోగాలు సోకకుండా కాపాడుతానన్నారు. పంటలు పండించేందుకు మందులను వాడటం తగ్గిస్తే.. వ్యాధులు రాకుండా ఉంటాయని సెలవిచ్చారు మాతంగి స్వర్ణలత. 5 వారాలపాటు పప్పు, బెల్లంతో నైవేద్యం సమర్పించి పూజలు చేయాలని చెప్పారు. ఈ రంగం కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. భవిష్యవాణి ముగిసిన అనంతరం.. అమ్మవారి ఊరేగింపు ఘట్టం ప్రారంభమైంది.