Hardik Pandya: టీమ్ఇండియాలో ఒక్కసారిగా తారాజువ్వలా ఎదిగిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్థానం కళ్లు మూసి తెరిచేలోగా కిందకు జారిపోతున్నట్టుగా ఉంది. ఐపీఎల్ లో గుజరాత్ కెప్టెన్ గా ఉండి ట్రోఫీని అందించి, తర్వాత ఏడాది రన్నరప్ స్థాయికి తీసుకువెళ్లిన హార్దిక్ పాండ్యా ఒక్కసారి ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోయాడు. అంతేకాదు ఆల్ రౌండర్ గా టీమ్ ఇండియాలో ఒక వెలుగు వెలిగాడు. అనంతరం ఫీల్డింగులో అత్యుత్సాహం కారణంగా వన్డే ప్రపంచకప్ 2023 లో గాయంతో ఆసుపత్రి పాలయ్యాడు.
అప్పటి నుంచి తన జీవితంలో చేదు ఘటనలన్నీ చూశాడు. చక్కగా గుజరాత్ కెప్టెన్ గా ఉన్న పాండ్యా జీవితం ముంబైకి మారింది. మరక్కడ ఎన్ని కోట్లకి డీల్ కుదిరిందో తెలీదు. అక్కడ నుంచి ప్రతికూలతలు ఎదురయ్యాయి. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. టీ 20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. రూపాయి నాణానికి ఒకవైపు ఉన్న కెరీర్ సెట్ అయినా, మరోవైపున జీవితంలో భార్య దూరమైపోయింది. ఇప్పుడు టీమ్ ఇండియా భావి భారత కెప్టెన్ గా కీర్తి అందుకున్న పాండ్యా కు శ్రీలంక పర్యటనలో చేదు అనుభవమే ఎదురైంది.
అటు వన్డే, ఇటు టీ 20 రెండింటికి తను కెప్టెన్ గా సెలక్ట్ కాలేదు. అంతేకాదు డిప్యూటీ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ని ఎంపిక చేశారు. దీంతో పాండ్యా దారులన్నీ దాదాపు మూసుకుపోయాయి. 2027 వన్డే వరల్డ్ కప్ నకు బహుశా గిల్ సారథ్యంలో వీళ్లందరూ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తనకి కెప్టెన్సీ రాకపోవడానికి అందరూ గౌతం గంభీర్ కారణమని అంటున్నారు. కానీ తన ఫిట్ నెస్ ప్రధాన కారణమని నెటిజన్లు చెబుతున్నారు.
Also Read: భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు.. ఐవోఏకు రూ. 8.5 కోట్లు
ఫిట్నెస్ను కాపాడుకోవడంలో తరచూ విఫలమవుతున్న హార్దిక్ పాండ్యా విషయంలో గంభీర్ ని మెప్పించలేకపోయారని నివేదికలు చెబుతున్నాయి. గత మూడేళ్ల పాండ్యా ఆటను చూస్తే, అందులో సెలవులే ఎక్కువ ఉన్నట్టు తేల్చారని అంటున్నారు. అందుకనే అతడిని పక్కనపెట్టి సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసినట్టు తెలిసింది. అంతేకాదు, ఈ విషయంలో అజిత్ అగార్కర్ పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం.
ఇకపోతే ఐపీఎల్ 2024లో ముంబయి టీమ్ లో గొడవలు, ఘర్షణలను పాండ్యా సమర్థంగా ఎదుర్కోలేకపోయాడని, కక్ష సాధింపు చర్యలకు దిగాడని, గ్రూపులు మెయింటైన్ చేశాడని, నాయకత్వ లక్షణాలు లేవనే విమర్శలు వచ్చాయి. ఇది జాతీయ జట్టులో అమలుచేస్తే…టీమ్ ఇండియా కొంప కొల్లేరవుతుందని సెలక్టర్లు, కోచ్ గంభీర్ భావించారని అంటున్నారు.