CM Revanth Reddy: జులై 22వ తేదీ.. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలను రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యల జయంతి. ఈ ఏడాది జులై 22వ తేదీ కవి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి అవుతున్నది. సాధారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి రోజున సాహితీరంగంలో కృషి చేసిన వారికి అవార్డులు ప్రకటిస్తుంది. ఈ సారి శత జయంతి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకున్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలను రగిల్చిన యోధుడు మన దాశరథి కృష్ణమాచార్యులని కొనియాడారు. ఆయన తెలుగు, ఉర్దూ, సంస్కృత, ఇంగ్లీష్ భాషల్లో పండితుడని వివరించారు. దాశరథి కృష్ణమాచార్య తన కలం నుంచి ఒక వైపు విప్లవాగ్నులను రగిల్చారని, మరో వైపు అనువాద, ప్రణయ కవిత్వాలను, సినీ గీతాలను వెలువరించిన సవ్యసాచి అని తెలిపారు. దాశరథి పోరాట పటిమ మలి దశ తెలంగాణ ఉద్యమ పోరాటానికి, పోరాట సాహిత్యానికి స్ఫూర్తిగా నిలిచిందని వివరించారు.
Also Read: శ్రావణ మాసంలో లక్ష్మీ-నారాయణ యోగం.. ఈ 3 రాశుల వారి జీవితం డబ్బు మయం
దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహితీ రంగంలో విశేష కృషి అందించిన వారిని గుర్తించి అవార్డును ప్రకటిస్తున్నారు. ఈ సారి కూడా ప్రభుత్వం వేసిన కమిటీ ఈ అవార్డు కోసం సాహితీపరులపై చర్చ జరిపింది. సిరిసిల్లకు చెందిన ప్రముఖ వచన కవి, రచయిత జూకంటి జగన్నాథంకు ఈ ఏడాది దాశరథి కృష్ణమాచార్య అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవోను కూడా విడుదల చేసింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కవి, రచయిత జూకంటి జగన్నాథంకు అభినందనలు తెలిపారు.