BCCI Announced Rs 8.5 cr Financial Assistance: పారిస్ ఒలింపిక్స్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇటు ప్రేక్షకులు కూడా ఇంకా ఎప్పుడు అన్న చందంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఈ ఒలింపిక్స్ కోసం రెడీ అయ్యింది. ఈ ఒలింపిక్స్ లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు 20 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలువురు క్రీడా గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఈ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు మద్దతుగా నిలిచేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. బోర్డు తరఫున భారత ఒలింపిక్ అసోసియేషన్కు రూ. 8.5 కోట్లను అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలియజేశారు. ‘2024 పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులకు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. మేం ఐవోఏకు రూ. 8.5 కోట్లు అందిస్తున్నాం’ అంటూ సోషల్ మీడియాలో జై షా పోస్ట్ పెట్టారు.