Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్నారు. ఆయన షుగర్ పేషెంట్. మొదట ఆయన స్వీట్లు తిని షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు వినిపించాయి. అరవింద్ కేజ్రీవాల్ కావాలనే సరిపడా భోజనం చేయడం లేదని, మెడికల్ డైట్ తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక గల కారణాలు ఏమిటో కనుక్కోవాలని ఇటీవలే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంతో బీజేపీ ఆడుకుంటున్నదని ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మెడికల్ రిపోర్టులు ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నాయని చెబుతున్నాయని వివరించారు. అరవింద్ కేజ్రీవాల్కు ఏ సమయంలో ఏమైనా జరగొచ్చని రిపోర్టులు వివరిస్తున్నాయని పేర్కొన్నారు.
‘అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంతో బీజేపీ ఆటలాడుతున్నది. వారికి ఇష్టం వచ్చినట్టు మాట మారుస్తూ కేజ్రీవాల్ పై నిందలు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఉద్దేశ్యపూర్వకంగా స్వీట్లు తిని షుగర్ లెవెల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ముందుగా వాళ్లు ఆరోపించారు. ఇప్పుడేమో కేజ్రీవాల్ కావాలనే ఆహారాన్ని సరిపడా తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఎవరైనా ఎందుకు ఇలా వారి జీవితాన్ని రిస్క్లో పెట్టుకుంటారు?’ అని సంజయ్ సింగ్ ప్రశ్నలు కురిపించారు.
Also Read: బంగ్లాదేశ్ సంక్షోభంపై బెంగాల్ సీఎం దీదీ కీలక వ్యాఖ్యలు
ఇటీవలే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులకు పంపిన అధికార సందేశాన్ని సంజయ్ సింగ్ విమర్శించారు. ఈ వ్యవహారం చూస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ను జైలులోనే చంపే కుట్ర జరుగుతున్నదని అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. తమ నాయకుడిని చంపాలనే కుటిల కుట్రకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం చీఫ్ సెక్రెటరీకి ఓ లేఖ రాశారు. తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కావాలనే ఔషధాలు, మెడికల్ డైట్ తీసుకోవడం లేదనే విషయం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. అసలు ఆయన ఇంటి నుంచి వస్తున్న ఈ భోజనాన్ని ఎందుకు తీసుకోవడం లేదో దర్యాప్తు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులను ఆదేశించారు. తిహార్ జైలు సూపరింటెండెంట్ కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి ప్రస్తావించిన రిపోర్ట్ను వీకే సక్సేనా ప్రస్తావించారు. అంతేకాదు, జులై 7వ తేదీన రాత్రిపూట ఆహారం తీసుకోవడానికి ముందు అరవింద్ కేజ్రీవాల్ ఇన్సూలిన్ తీసుకోవడానికి నిరాకరించారనీ ఆ రిపోర్టు పేర్కొంది.