Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్ ప్రాంతాల నుంచి శరణార్థులుగా వచ్చి తమ తలుపు తడితే తప్పకుండా వారిని అక్కున చేర్చుకుంటామని చెప్పారు. ‘నేను బంగ్లాదేశ్ గురించి వ్యాఖ్యానించను. ఎందుకంటే అది వేరే దేశం. ఆ పని భారత ప్రభుత్వం చేస్తుంది. కానీ, ఒక వేళ బంగ్లాదేశ్ నుంచి నిస్సహాయులు ఎవరైనా బెంగాల్లోకి వస్తే.. తమ తలుపు తడితే తప్పకుండా వారికి ఆశ్రయం ఇస్తాం. ఐరాసలో ఇందుకు సంబంధించి ఓ తీర్మానం ఉన్నది. శరణార్థులను ఇరుగు పొరుగు గౌరవించాలని ఆ తీర్మానం చెబుతున్నది’ అని మమతా బెనర్జీ వివరించారు.
కోల్కతాలో భారీ వర్షం కురుస్తున్నా అమరవీరుల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ర్యాలీలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మాట్లాడారు. ‘బెంగాల్ నివాసుల బంధువులు ఎవరైనా బంగ్లాదేశ్లో చోటుచేసుకుంటున్న హింసకు బాధితులుగా మారితే.. ఆ బెంగాల్ వాసులకు మేం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామ’ని మమతా బెనర్జీ వివరించారు. కేంద్రంలోని ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని, త్వరలోనే అది కూలిపోతుందని చెప్పారు. ఎందుకంటే ఇది బలహీన ప్రభుత్వమని, అస్థిర ప్రభుత్వమని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో మీరు ఆడిన ఆటలో యూపీలోని బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చిందని, కానీ, నిస్సిగ్గుగా వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఏజెన్సీలు, ,ఇతర పద్దతుల్లో ప్రతిపక్షాలను భయపెడుతున్నారని చెప్పారు.
Also Read: ‘హోటళ్ల బయట యజమానుల పేర్లుండాలి’.. యుపి ప్రభుత్వ ఆదేశాలపై మండిపడిన కేంద్రమంత్రి
బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. మిలిటరీ బలగాలు రాజధాని ఢాకా నగరంలో పెట్రోలింగ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, కేటాయింపుల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చిచ్చురేగింది. హింస పెచ్చరిల్లింది. ఈ దాడిలో కనీసం 40 మంది మరణించారు.
కాగా, మమతా బెనర్జీ ఇదే ర్యాలీలో పాల్గొన్న సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తోనూ మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో గణనీయంగా రాణించిందని వివరించారు. అందుకే బీజేపీకి వెన్నులో వణుకు పుట్టిందని ఆరోపించారు. సమాజ్వాదీ దెబ్బతో బీజేపీ దివాళా తీసిందని అన్నారు. యూపీలో చాలా సీట్లల్లో బీజేపీని సమాజ్వాదీ పార్టీ ఓడించిందని తెలిపారు. బెంగాల్ ప్రజలు బీజేపీని ఎదిరించినట్టే యూపీలోనూ ప్రజలు బీజేపీని తరిమికొడుతున్నారని అఖిలేశ్ యాదవ్ ఈ ర్యాలీలో అన్నారు.