Ambati Rambabu: టీడీపీ కూటమి ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చింది. కాబట్టి, అది కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి. ఇప్పుడే వీధి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు అనే తాము అనుకున్నామని అంబటి రాంబాబు తెలిపారు. రెండు మూడు నెలల వరకు ఏమీ మాట్లాడకుండా ఉందామనే అనుకున్నామని చెప్పారు. కానీ, నెల రోజులకే పరిపాలనపై పోరాడే, పరిపాలనను ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు.
వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదికి వస్తే నష్టపోయేది ప్రజలు కాదని.. తెలుగు దేశం పార్టీనే అని హెచ్చరించారు. అసలు జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదికి తీసుకువచ్చిందే మీరని టీడీపీపై విమర్శలు సంధించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, ప్రజలందరూ ఈ మాటను విశ్వసిస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం పథకంలో విధి విధానాలు రూపొందిస్తామని బుకాయిస్తున్నారని, ఏ విధి విధానాలు నిర్ణయిస్తారని ప్రశ్నించారు.
టీడీపీ నెల రోజుల పాలన చూస్తేనే వారి ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందో అర్థమైపోతుందని అంబటి చురకలంటించారు. ఈ పాలనలో రాజకీయ ప్రత్యర్థుల గొంతు నులిమే.. అక్రమ కేసులు బనాయించే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ నేతలను హత్యలు చేయడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం టీడీపీ పాలనలో విచ్చలవిడిగా జరుగుతున్నదని పేర్కొన్నారు. వైసీపీ నేతల మీద 307 సెక్షన్ కేసులు పెడుతున్నారని, పెద్దిరెడ్డి మీద అదే కేసు పెట్టారని చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా అదే కేసు పెట్టారని, ప్రతి ఒక్కరిపైనా 307 కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వం చేస్తున్న పని అని విమర్శించారు.
అవసరమైతే జైలులో ఉంటామని, చంద్రబాబు జైల్లో ఉన్నాడని, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉన్నారని అంబటి అన్నారు. పక్క రాష్ట్రంలో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా జైలుకు వెళ్లారనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు.
Also Read: రానున్న మూడు రోజులూ వర్షాలే.. బీ అలర్ట్
అయినా.. జగన్ ప్రజాదారణ తగ్గదని అంబటి అన్నారు. ఆయన అత్యధిక ప్రజాదారణ కలిగిన వ్యక్తి అని, అందుకే వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని వివరించారు. అదే కూటమి మొత్తం కలిపి వచ్చింది 53 ఓట్ల శాతం అని వివరించారు. అందులో బీజేపీ, జనసేన ఓట్లను తీసేస్తే టీడీపీకి 30 శాతం ఓటు బ్యాంకు కూడా ఉండదని విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డి కోసం 40 శాతం మంది ప్రజలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని వివరించారు. తప్పకుండా మళ్లీ వైసీపీకి మంచి రోజులు వస్తాయని, చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కాకతప్పదని అన్నారు. రెడ్ బుక్ పేరుతో చాలా మందిని భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. టీడీపీ పాలన ఎలా ఉన్నదంటే.. టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ఆలోచనలకు వచ్చారని విమర్శించారు.