Rain Alert in Telangana for 3 Days: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా కీలక సూచన చేసింది. రానున్న 3 రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ సమయంలో ఈదురుగాలులు వీస్తాయని కూడా సూచించింది. చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం రాత్రి ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిందంటూ పేర్కొన్నది. ఈ అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం ఒడిశా-ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 12 గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడనున్నదని వాతావరణ కేంద్రం వివరించింది.
దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమురంభీం, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. అదేవిధంగా ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: జూరాలకు భారీగా వస్తున్న వరద నీరు..
ఇదిలా ఉంటే.. హైదరాబాద్లో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో నగరంలోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. మారియట్ హోటల్ వద్ద ఉన్న మత్తడి నుంచి భారీగా దిగువనకు నీరు దూకుతుండడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొన్నది. దూకుతున్న నీటిని చూసేందుకు స్థానికులు, అటుగా వెళ్లే ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు.
కాగా, హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు(ఎఫ్టీఎల్) కాగా, ప్రస్తుతం 513.23 మీటర్లకు చేరింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సంబంధిత అధికారులు సూచించారు.