Chandrababu: విజన్ 2020. ఈ పదం వినగానే ముందుగా గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడే. ఎప్పుడో 2000 సంవత్సరంలోనే, ఎంతో ముందుచూపుతో, 20 ఏళ్ల భవిష్యత్తు లక్ష్యాలతో విజన్ 2020ని తీసుకొచ్చారు. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారడానికి ఆయనే కారణం. సైబరాబాద్ నిర్మాత కూడా ఆయనే. మీ సేవతో టెక్నాలజీని పాలనలో ప్రవేశపెట్టారు. ఇప్పుడంతా డిజిటల్ ఇండియా జపం చేస్తున్నారు కానీ.. చంద్రబాబు ఏనాడో ఊహించారు. అలాంటి బాబు.. మరోసారి తన ఇండియన్ విజన్ ను ప్రధాని మోదీ సమక్షంలో ఆవిష్కరించారు. చంద్రబాబు విజన్ కు ఇంప్రెస్ అయిన మోదీ.. ఆయనను నీతి అయోగ్ అధికారులతో చర్చించాలని కోరారు. ప్రధాని సూచన మేరకు.. నీతి అయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో సమావేశమయ్యారు చంద్రబాబు.
ఇంతకీ పీఎం మోదీ అంతలా ఎందుకు ఇంప్రెస్ అయ్యారు? చంద్రబాబు అసలేం చెప్పారు? అనేది ఆసక్తికరం. జీ-20 సమ్మిట్ నిర్వహణపై ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశంపై చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. బాబు సూచించిన పలు అంశాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారంటే వాటికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.
‘ఇండియా ఎట్ హండ్రెడ్ ఇయర్స్- గ్లోబల్ లీడర్’ పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని చంద్రబాబు తన ప్రసంగంలో అన్నారు. దేశ భవిష్యత్ ప్రయాణంపై విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని.. వచ్చే 25 ఏళ్లలో భారత్ నెంబర్ వన్గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం సరైన సమయంలో ఐటీ, డిజిటల్ వ్యవస్థను అందుకోగలిగిందన్నారు. మేధోసంపన్నమైన ఆర్థిక వ్యవస్థకు ఐటీ వెన్నెముక అని గుర్తు చేశారు. యువశక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే.. భారతీయులు ఉద్యోగ, సంపద సృష్టికర్తలుగా మారి.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్ వ్యవస్థలను శాసించగలిగే స్థాయికి చేరొచ్చని చంద్రబాబు అన్నారు.
బాబు స్పీచ్ కు ఫిదా అయిన మోదీ.. తన ప్రసంగంలో ఆయన విజన్ ను ప్రస్తావించారు. డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్పై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు ప్రధాని సూచించడంతో నీతి ఆయోగ్ సీఈవోతో సమావేశమయ్యారు చంద్రబాబు.