All Party Meet : ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారో తెలిపారు టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఈ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలపై చర్చించినట్లు తెలిపారు. తమ వైపు నుంచి అన్ని సలహాలను ఇచ్చినట్లు చెప్పారు. అలాగే సమావేశాల్లో తమ ఎంపీలు నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడే అవకాశమివ్వాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అంశాలపై అసెంబ్లీలో విడుదల చేయనున్న వైట్ పేపర్ గురించి పార్లమెంట్ లో కూడా వివరిస్తామని తెలిపారు.
ఏపీలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్ లో వివరిస్తామని కేంద్రం నుంచి సహాయం కోరుతామని ఎంపీ తెలిపారు. కేంద్రాన్ని ఎలాంటి సపోర్ట్ అడుగుతామన్నది పార్లమెంట్ వేదికగా ప్రజలకే తెలుస్తుందన్నారు. ముఖ్యంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు.
పోలవరం, అమరావతిలపై విడుదల చేసిన శ్వేతపత్రాల గురించి పార్లమెంట్లో వివరిస్తామని తెలిపారు. అమరావతి అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, ఇతర అంశాలపై పార్లమెంట్ లో చర్చిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్ లో చర్చించడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్ని అన్ని సమస్యలపై పార్లమెంటులో మాట్లాడుతామన్నారు.
మరోవైపు వైసీపీ చేస్తున్న రాజకీయాలపై అసహనం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు ఎంపీ కృష్ణదేవరాయలు. అమరావతి, పోలవరం అంశాలపై మాట్లాడితే.. ఐదేళ్లుగా చేసిన తప్పులన్నీ బయటపడుతాయని.. ఢిల్లీలో ఆందోళన చేస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీ బాట పట్టారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి కానీ.. ఇక్కడ మాత్రం ఢిల్లీకి వస్తామంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రులను కలిసి మాట్లాడారని గుర్తు చేశారు.