Indian parliament rules and regulations to MPs
సోమవారం జులై 21 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకూ జరుగుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మూడో సారి అధికారంలోకి వచ్చింది మోదీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ నెల 23న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు.
పార్లమెంట్ నియమావళి
నూతన పార్లమెంట్ భవనంలో ప్రారంభమయ్యే ఈ బడ్జెట్ సమావేశాలలో ప్రజాప్రతినిధులు పార్లమెంట్ నియమావళిని అనుసరించి కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. సభలో పార్లమెంట్ సభ్యులు తమ నిరసనను ప్ల కార్డుల ద్వారా తెలపడం ఆనవాయితీ. ఇకపై అలాంటి నిరసనలు పార్లమెంట్ లో చేయకూడదు. పార్లమెంట్ బయట ప్రదర్శించవచ్చు. ఇక సభ్యులు పార్లమెంట్ భవనంలోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు గౌరవంగా స్పీకర్ సీటుకు తల వంచి అభివాదం చేయాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా హ్యాండ్ బుక్ ముద్రించి దూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సభ్యులకు వివరించింది.
దేశభక్తి నినాదాలపై నిషేదం
ఎట్టి పరిస్థితిలోనూ సభలో జైహింద్, జై భారత్, వందే మాతరం వంటి నినాదాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలలో ఎన్డీయే సర్కార్ పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. మెజారిటీ సభ్యుల ఆమోదంతో వాటిని ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఆరు ముఖ్యమైన బిల్లులు ఎలాగైనా మెజారిటీ సభ్యుల మద్దతుతో ఓకే చేయించుకునేందుకు కసరత్తు చేస్తోంది కేంద్రం. ఇప్పుడు ఏ బిల్లు ఆమోదం కావాలన్నా మిత్ర పక్షాల మద్దతు తప్పనిసరి. గత పదేళ్లుగా ఏక పక్ష నిర్ణయాలతో సాగిపోయిన బీజేపీ సర్కార్ కు ఇకపై మిత్ర పక్షాల సహకారం ఉండేలా చూసుకోవడం ముఖ్యం.