CSK Ex Player Badrinath : టీమ్ ఇండియాకి హెడ్ కోచ్ గా వచ్చిన గౌతమ్ గంభీర్ పై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్ ఉన్నవారికే టీమ్ ఇండియా జట్టులో అవకాశాలు వచ్చాయని సీఎస్కే మాజీ ఆటగాడు బద్రీనాథ్ అనడంతో నెట్టింట వేడి పుట్టింది.
ఎందుకంటే శ్రీలంక పర్యటనకు సెలక్ట్ చేసిన జట్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తనకి నచ్చినవారికే గంభీర్ పెద్ద పీట వేశాడని, కోల్ కతా టీమ్ లో ఉన్న ముగ్గురికి చోటు కల్పించాడని, బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ పక్కన పెట్టిన శ్రేయాస్ ని ఎలా తీసుకొస్తాడని తిట్టిపోస్తున్నారు. ఇంక క్రమశిక్షణకు విలువేది అంటున్నారు.
వీళ్లందరి బాధ ఏమిటంటే జింబాబ్వే టూర్ లో అద్భుతంగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ని, అలాగే సూపర్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మని పక్కన పెట్టడం సరికాదని అంటున్నారు. ఇంతకీ సీఎస్కే మాజీ ఆటగాడు బద్రీనాథ్ ఏమన్నాడంటే, రుతురాజ్ ను శ్రీలంక టూర్ కి తీసుకోకపోవడం షాక్ కి గురి చేసిందని అన్నాడు. టాలెంటెడ్ ప్లేయర్లు ఎంపిక కానప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తమవుతుంటాయని అన్నాడు.
Also Read : బెస్ట్ ఫీల్డర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. కెరీర్ ముగిసినట్టేనా?
జట్టుకి నిరంతరం ఎంపిక కావాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్ షిప్ లో ఉండాలేమో, ఒళ్లంతా టాటూలు వేయించుకోవాలేమో, లేదంటే మంచి మీడియా మేనేజర్ ని కలిగి ఉండాలేమోనని వ్యంగ్యంగా అన్నాడు. జింబాబ్వే పర్యటనలో పెద్దగా ఆకట్టుకోని, బీసీసీఐపై బహిరంగ విమర్శలు చేసిన రియాన్ పరాగ్ లాంటివాళ్లని శ్రీలంక పర్యటనలో రెండు ఫార్మాట్లకు ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా లేదని శ్రేయాస్ అయ్యర్, రియాన్ పరాగ్ లను తెచ్చారని అంటున్నారు. రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఆల్రడీ ఉండగా మిడిల్ ఆర్డర్ పై బెంగ ఎందుకని అంటున్నారు. మొత్తానికి బద్రీనాథ్ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.
రిషబ్ పంత్ ని కావాలని టీ 20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంటులో ఫస్ట్ డౌన్ తీసుకొచ్చి అలవాటు చేశారు కదా.., తను కూడా చక్కగా కుదురుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా నమ్మదగ్గ బ్యాటర్ గా ఉన్నాడు.. వీరంతా కలిసి ప్రపంచకప్ తెచ్చిన తర్వాత ఇంకెందుకు మిడిలార్డర్ బాధ అని మండిపడుతున్నారు.