AP Weather Update: ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. ఇవాళ కొంత వరకు వానలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కానీ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలతో కృష్ణ, గోదావరి నదుల్లో ప్రవాహ తీవ్రత పెరుగుతుందంటున్నారు. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరదలు భారీస్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో చాలా జిల్లాల్లో వర్ష ప్రభావంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వందల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఏలూరు, తూర్పుగోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. అక్కడి చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. రహదారులపై పెద్దెత్తున నీరు చేరడంతో పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఏపీ వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు. ఉద్యాన పంటలూ దెబ్బతిన్నాయి.
వర్షాలు, వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగిన్నట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నీటిలో మునిగి యువకుడు చనిపోయాడు. అల్లూరి జిల్లాలో ఒకరు, కృష్ణాలో మరొకరు ఇళ్లు కూలడంతో చనిపోయాడు. అల్లూరి జిల్లాలో జి మాడుగులలో ఇంటిగోడ కూలి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. హుకుంపేటలో పాఠశాల భవనంపై చెట్టు కూలిపోయింది. స్కూలుకు ముందు సెలవు ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Also Read : శ్రీశైలం జలాశయానికి భారీగా పెరిగిన వరద నీరు.. పూర్తిగా నిండితే తరువాత పరిస్థితి ఏంటి..?
ధవళేశ్వరం దగ్గర వరద పోటెత్తింది. నిన్న సాయంత్రానికి 4.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇవాళ కూడా ధవళేశ్వరం దగ్గర భారీ వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రేపటిలోగా మొదటి ప్రమాద హెచ్చరికకు వరద చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లో వరద ఉధృతి పెరిగింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది.
తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని చాలా గ్రామాలపై వరద ప్రభావం భారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాల్లోని 25 పశువుల కొట్టాలు నాశనం అయ్యాయి..చాలా చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో 3 చోట్ల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు..దాదాపు 700లకుపైగా జనాన్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏలూరు జిల్లాలో గండిపోచ్చమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వాగులు పొంగాయి, పొలాలు నీట మునిగాయి.
అధికారుల లెక్కల ప్రకారం ఏపీలో 600 కిమీటర్ల పైగా రోడ్లు దెబ్బతిన్నాయి. 200లకుపైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మూడు సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. ఎర్రకాలువకు వరద పోటెత్తింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండల నత్త రామేశ్వరంలో ఆలయంలోకి నీరు చేరింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. గుర్రాల వాగు ఉగ్రరూం దాల్చింది. కట్టలేరుకు వరద పెరగడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read : భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం
అక్కపాలెం రహదారిలోని వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని పలు గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంచికచర్ల మండలం చెవిటికల్లులోని లక్ష్మయ్యవాగు పొంగి ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం మోపర్రులో నారుమడులు నీటమునిగాయి. అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. పాడేరు డివిజన్ 60 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఇక్కడి ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. డుంబ్రిగుడ దగ్గర వంతెన కొట్టుకుపోయింది.
నదులు, వాగుల్లో వరద ప్రవాహాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులకు సీఎం, మంత్రులు సూచించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని మంత్రులు సూచించారు.