Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్ కి కౌంట్ డౌన్ స్టార్టయ్యింది. మరో ఐదురోజుల్లో ప్రపంచ క్రీడా పండుగ ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పారిస్కు చేరుకున్నారు. విశ్వక్రీడల్లో తమ సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇదిలా ఉండగా పారిస్ ఒలింపిక్స్ క్రీడా గ్రామంలోని తాజాగా కొంతమంది భారత అథ్లెట్లు దర్శనమిచ్చారు. ఇప్పటికే ఆర్చరీ, రోయింగ్ టీమ్స్ క్రీడా గ్రామానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఒలింపిక్స్కు భారత చెఫ్ డి మిషన్గా బాధ్యతలు అందుకున్న దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ వెల్లడించాడు. పురుషుల హాకీ జట్టు కూడా ఈ గ్రామానికి చేరుకోనుందని తెలిపాడు. పతకాలు సాధించే సత్తా ఉన్న భారత అథ్లెట్ల సంఖ్య పెరగడం.. ఎంతో గర్వంగా ఉంది” అంటూ నారంగ్ మీడియాకు తెలిపాడు.
ఇక ఆటతోనే కాదు, తమ దేశాల చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ తయారైన జెర్సీలు సిద్ధమయ్యాయి. మన భారత అథ్లెట్లు వేసుకోనున్న జెర్సీలు రెడీ అయ్యాయి. ఆటల్లో ధరించేందుకు నీలం రంగు జెర్సీని జేఎస్డబ్ల్యూ ఇన్స్పైర్ రూపొందించింది. ఆరంభ, ముగింపు వేడుకల కోసం భారత త్రివర్ణపతాకంలోని రంగులతో ప్రత్యేక చీరలను, ఇంకా కుర్తా, పైజామాను రూపొందించారు. ఇక ప్రాక్టీస్, ఖాళీ సమయాల్లో వేసుకునే దుస్తులను ప్రముఖ స్పోర్ట్స్ వేర్ విక్రయ సంస్థ ప్యూమా సిద్ధం చేసింది.
32 క్రీడాంశాల్లో 329 స్వర్ణపతకాలు సిద్ధంగా ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ ఖర్చు సమారు 10 బిలియన్ డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.85 వేల కోట్ల రూపాయలు అని చెప్పాలి. టోక్యో ఒలింపిక్స్ కంటే తక్కువే అంటున్నారు. కరోనా కారణంగా జపాన్ కి ఖర్చు ఎక్కువైందని అంటున్నారు.
Also Read : పాకిస్తాన్ పై గెలుపు.. అమ్మాయిల ఆసియా కప్ లో.. భారత్ బోణీ
ఇకపోతే క్రీడా గ్రామాన్ని పారిస్ లో ముఖ్యమైన ప్రాంతంలో నిర్మించారు. ఒలింపిక్స్ అనంతరం దీనిని ప్రత్యేక టౌన్ షిప్ గా మార్చనున్నారు. అందుకే పకడ్బందీగా కొన్నిచోట్ల శాశ్వత నిర్మాణాలు చేశారు. లేదంటే ఇంత డబ్బు వృధా అయిపోతుందని భావించి ఇలా నిర్మించారు. ఇందులో 2800 అపార్టుమెంట్లు నిర్మించారు. క్రీడల తర్వాత ఇక్కడ పార్కులు, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు వస్తాయి. అలాగే ఇళ్లు లేని నిరుపేదలకు 25 శాతం అపార్టుమెంట్లలో ఫ్లాట్లు ఇస్తారు. మిగిలినవి ప్రభుత్వ ధరలకి విక్రయిస్తారు.
తాత్కాలికంగా చేసిన ఏర్పాట్లలో కూడా ముందుచూపుతో వ్యవహరించారు. అందుకే ఎక్కువ భాగం చెక్కలనే వాడారు. వీటిని పునర్వినియోగం చేసేలా చూస్తున్నారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా వృథా కాకూడదని భావిస్తున్నారు. ఇక క్రీడలకు 90శాతం పాత స్టేడియంలు, ఖాళీ ప్రదేశాలని వినియోగిస్తున్నారు. చాలా దేశాలైతే ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తూ కొత్త కొత్త స్టేడియంలు కట్టి హంగామా చేస్తుంటారు. పారిస్ మాత్రం దుబారా ఖర్చులకి దూరంగా ఉండి, రాబోవు ఒలింపిక్స్ గేమ్స్ కి ఒక మార్గదర్శకంగా నిలిచిందని అంటున్నారు.
ఇవికాకుండా పిల్లల్లో క్రీడా ఆసక్తిని పెంపొందించేలా వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. పోటీలు పెట్టి పతకాలు ఇస్తున్నారు. మొత్తం పారిస్ నగరంలోని లక్షలాది మంది ప్రజలను ఏదో విధంగా క్రీడావేడుకల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. వారిలో స్రజనాత్మకతను పెంపొందించేలా సాంస్క్రతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక ఒలింపిక్స్ ఫీవర్ రగిలేలా చేస్తున్నారు. ఇలా చూసుకుంటే ఈసారి ఒలింపిక్స్ వేడుకలు మాత్రం డిఫరెంటుగా జరుగుతున్నాయని అంటున్నారు.