Chandrababu Naidu: రాష్ట్రంలో హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని కాపాడటంలో రాజీ పడబోమని.. హింసాకాండను ఉక్కుపాదంతో అణచివేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయంగా రాష్ట్ర శాంతిభద్రతల్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఎనిక్నల్లో పూర్తిగా తిరస్కరించినా వైసిపీ అధ్యక్షుడు జగన్మోషన్ రెడ్డి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని, పార్టీ ఉనికి చాటుకోవడానికే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 36 మందిని హత్యకు గురయ్యారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తుంటే.. టిడిపి నాయకులు, మంత్రులు.. గట్టిగా తిప్పికొట్టకపోవడంపై ముఖ్యమంత్రి కొంత అసహనం ప్రకటించారు. హత్య చేయబడ్డ 36 మంది వివరాలు బయటపెట్టాలని ఎందుకు నిలదీయడం లేదని మంత్రులను, టిడిపి ఎంపీలను ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, ఏవిధంగానూ రాజీపడకూడదని తెలిపారు. టిడిపి కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించొద్దని పోలీసులకు ఆదేశాలిచ్చారు.
హోం మంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. పోలీసు అధికారులు వెంటనే స్పందించకపోతే వారిని సస్పెండ్ చేయడానికి వెనుకాడొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
‘ఐదేళ్ల వైసీపీ జగన్ పాలనలో డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యంపై రాష్ట్రంలో అదుపు లేకపోవడం వల్ల నేరాల రేటు పెరిగిపోయింది. త్వరలోనే పూర్తిగా నియంత్రణ చేస్తాం. టిడిపీ పాలనలో శాంతిభద్రతల నిర్వహణ అత్యుత్తమంగా ఉంటుందనే పేరుంది. ఆ పేరు చెడగొట్టడానికి ఎవరు ప్రయత్నించినా సహించేది లేదు. ఫ్యాక్షన్, మతఘర్షణలు, రౌడీయిజం, నక్సలిజాన్ని నియంత్రించిన చరిత్ర టిడీపి ప్రభుత్వానికుంది. తెలుగుదేశం నాయకులపై తప్పుడు ఆరోపణలు చేసేవారిని ప్రజలు నమ్మరు. అయినా అప్రమత్తంగా ఉండాలి’ అని చెప్పారు.
Also Read: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ
టిడిపీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్.. ఫేక్ పాలిటిక్స్ను నమ్ముకున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘వ్యక్తిగత కారణాలతో పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్యకు రాజకీయ రంగు జగన్ పులుముతున్నారు. చనిపోయిన వ్యక్తికి, నిందితుడికి మధ్య వ్యక్తిగత గొడవలున్నట్లు వైసీపీ నాయకులే అంగీకరించారు. పోలీసుల విచారణలో కూడా అదే తేలింది. అయినా వైసీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారు.’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండేందుకే ఢిల్లీలో ధర్నా పేరుతో జగన్ డ్రామా చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.‘జగన్ మళ్లీ తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. వైసీపీ కుట్రలని సాగనివ్వం. వినుకొండలో జరిగిన హత్య అత్యంత కిరాతకం. దోషలను వదిలేది లేదు. హింసాకాండకు ఎవరు పాల్పడినా కఠినంగా శిక్షించి.. తప్పు చేస్తే తప్పించుకోలేమన్న భయం కల్పిస్తాం. నాకేదీ శాంతిభద్రతల కంటే ముఖ్యం కాదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.