Israel carries out airstrikes in Yemen: యెమెన్ లోని హౌతీ రెబల్స్ పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. పశ్చిమ ప్రాంతాంలోని అల్ హుదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. ఓ వైపు గాజాపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, హమాస్కు మద్దతుగా నిలుస్తున్న హెజ్జొల్లా, హౌతీ మిలిటెంట్లనూ ధీటుగా ఎదుర్కొంటుంది.
గత కొంతకాలంగా దాడులు చేస్తున్న హౌతీలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపింది. ఈ దాడిలో అల్ హుదైదా పోర్టులోని హౌతీ స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇందులో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. 1800 కిలోమీటర్ల దూరంలోని యెమెన్ పై ఇజ్రాయెల్ నేరుగా సైనిక దాడి చేయడం ఇదే తొలిసారి.
గాజాపై ఇజ్రాయెల్.. మూడు వేర్వేరు వైమానిక దాడుల్లో 39 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇందులో ఓ మహిళ, ముగ్గురు చిన్నారులతో పాటు ఓ జర్నలిస్ట్, అతని కుటుంబం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 38,919 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా అధికారులు వెల్లడించారు. అదే విధంగా హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు మృతి చెందారు.
అయితే ఈ దాడి అనంతరం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గెలెంట్ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘ ఇజ్రాయెల్ పౌరుల రక్తానికి ఒక ధర ఉంది. ఇరాన్ మద్దతు గల హౌతీలు మాపై దాడి చేసేందుకు సాహసిస్తే వారిపై మరిన్ని తీవ్ర దాడులు చేస్తాం.’ అని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: నేను ఉంటే అలా జరిగివుండేది కాదు: డొనాల్డ్ ట్రంప్
ఇదిలా ఉండగా, ఓ అద్భుతం జరిగింది. గాజాపై ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇందులో ఓ భవనంపై ఆ దేశం విమాన దాడులు చేసింది. సుసీరత్ శిబిరంలో 25 ఏళ్ల గర్భిణి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను అల్ అవుదా ఆస్పత్రికి అతికష్టం మీద తరలించారు. అయితే ఆమెకు చికిత్స అందిస్తుండగానే చనిపోయింది. దీంతో వెంటనే ఆమెకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయగా శిశువు హార్ట్ బీట్ వినిపించింది. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం మగబిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.