Nipah infection confirmed in Kerala: నిఫా వైరస్ మళ్లీ వణికిస్తోంది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకింది. తాజాగా, ఆ బాలుడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఆందోళకరంగా ఉందని, ఒకవేళ పరిస్థితి విషమిస్తే కోజికోడ్ మెడికల్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షల నిమిత్తం బాలుడి నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. ఈ వైద్య పరీక్షల్లో సదరు బాలుడికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జీ ప్రకటించారు. అనంతరం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ప్రస్తుతం బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యమంత్రి తెలిపారు. అయితే బాలుడితో పరిచయం ఉన్న వ్యక్తులను ట్రేస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైతే అతని దగ్గరగా సన్నిహితంగా ఉన్నారో వారి వ్యక్తుల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపనున్నారు. ఇప్పటికే హై రిస్క్ కాంటాక్టులను విభజించి నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. దీంతోపాటు మలప్పురంలోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు వైరస్ వ్యాప్తిని కట్డి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అయితే ఈ వైరస్ సోకితే మరణించే అవకాశాలు 40 నుంచి 75 శాతం వరకు ఉండటం, దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.