China Bridge Collapse Kills 11 People: ప్రయాణిస్తున్న సమయంలో సెడెన్గా బ్రిడ్జి కూలింది. ఈ ప్రమాదం బారిన పడి 11 మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. గత కొద్ది రోజుల నుంచి చైనాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు, నదులు భారీగా పొంగిపొర్లుతున్నాయి. షాంగ్లూ నగరంలోని ఝూషుయ్ కౌంటీలోని రహదారిపై ఉన్న బ్రిడ్జి వరదల కారణంగా కూలిపోయింది. దీంతో ఆ సమయంలో దానిపై ప్రయాణిస్తున్న 11 మంది ప్రయాణికులు మృతిచెందారని, పలువురికి గాయాలయ్యాయని, మరికొంతమంది గల్లంతయ్యారని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకున్నట్లు తెలిపారు.
Also Read: అత్యధిక ఎక్స్ ఫాలోవర్స్ కలిగిన నాయకుడు మోదీ.. భారత ప్రధానికి శుభాకంక్షలు తెలిపిన మస్క్
నదిలో గల్లంతైన వారి ఆచూకీ కోసం 736 మంది రెస్క్యూ సిబ్బంది, 76 వాహనాలు, 18 బోట్స్, 32 డ్రోన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. నదిలో పడిన 5 వాహనాలను రెస్క్యూ బృందాలు గుర్తించి, బయటకు తీశాయని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్.. ఈ ప్రమాదం పట్ల ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో వరద నియంత్రణ సమస్యాత్మకంగా మారినట్లు ఆయన తెలిపారు. అయితే, స్థానిక ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకుని, అన్నింటినీ మానిటర్ చేయాలంటూ సూచించారు.