Changing School Timings: రాష్ట్రంలో పాఠశాలల వేళలను మారుస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 గంటల నుంచి 9 గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాయంత్రం 4.45 గంటలకు బదులుగా 4.15 గంటలకు పని వేళలు ముగుస్తాయని అందులో తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్లో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలే కొనసాగుతాయని సూచించింది. దీంతో జంట నగరాల్లో ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు.
Also Read: రేపు, ఎల్లుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఏమంటే..?
ఇదిలా ఉంటే.. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. జులై 5 నుంచి నేటి వరకు బదిలీ ప్రక్రియ జరిగేలా ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందోరగోళంగా తయారైంది. మార్గదర్శకాలను అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆందోళన చేస్తుండడంతో బదిలీలు కొలిక్కి రాలేదు. దీంతో ఈ బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.