Nagababu Comments on Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సినీ యాక్టర్, జనసేన నేత నాగబాబు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. వినుకొండలో రషీద్ హత్యపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కాలేదు.. అప్పుడే విమర్శలా? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దుర్మార్గపు పాలనను జగన్ హయాంలో చూశామన్నారు. ఆయన మరోసారి అధికారంలోకి రాకుండా చేసి ప్రజలు తమను తాము కాపాడుకున్నారంటూ నాగబాబు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని నాగబాబు ఆరోపించారు.
Also Read: తాడిపత్రిలో పోలీసుల టెన్షన్, పెద్దారెడ్డి వచ్చి మళ్లీ వెళ్లారు
‘జగన్ ఇంకా ఎంతకాలం నటిస్తారు.. ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు ఏపీ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. కానీ మీరు అత్యంత దారుణంగా ఏపీని పాలించారు. మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు. ఆనాడు ప్రజల భూములను అడ్డగోలుగా కబ్జా చేస్తుంటే మీ దృష్టికి రాలేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు మీరు ఎంత కుట్ర పన్నారో ప్రజలకు తెలుసు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలా..? అసలు మీకు ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారో మాకు అర్థం కావడంలేదు. మీ పరిపాలనలో ప్రజా వేదికను కూల్చినప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలి.. కానీ, ఇప్పుడు కాదు. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా ఉండేందుకే మీరు ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలనే నాటకమాడుతున్నారు’ అంటూ జగన్పై నాగబాబు మండిపడ్డారు.