ఎందుకంటే శ్రీలంక పర్యటనకు ఫోన్లు చేసి కొహ్లీ, రోహిత్ లను పిలిచిన గంభీర్ మరి జడేజాకి ఎందుకు ఫోన్ చేయలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంటే తనని వదిలేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 35 ఏళ్ల రవీంద్ర జడేజా పరిస్థితి ఇప్పుడేమిటి? అని సీరియస్ అవుతున్నారు.
తనేమీ సాధారణ ఆటగాడు కాదు.. ప్రపంచంలోనే మేటి ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ, ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు అందుకుని, మ్యాచ్ ని ఒంటిచేత్తో మలుపులు తిప్పిన ఘటనలెన్నో ఉన్నాయి. ఇక రన్ అవుట్లు అయితే తిరుగేలేదు. ఎంత దూరం నుంచైనా వికెట్లను గురి చూసి కొట్టడంలో తన తర్వాతే అందరూ అంటారు. అందుకు నిదర్శనాలెన్నో ఉన్నాయి. తను గేమ్ లో ఉన్నాడంటే, కనీసం పది నుంచి ఇరవై పరుగులన్నా ఆపుతాడనే పేరుంది.
అంతేకాదు తను స్పెషలిస్ట్ లెఫ్టార్మ్ స్పిన్నర్, అలాగే మంచి బ్యాటర్ కూడా.. రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేయడంతో జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2009లో జాతీయ జట్టులోకి వచ్చిన జడేజాకి ధోనీ కాలం స్వర్ణయుగమని చెప్పాలి. జట్టులో కీలక ఆటగాడీగా, ధోనీ శిష్యుడిగా పేరుతెచ్చుకున్నాడు. చివర్లో వీరిద్దరూ కలిసి ఎన్నో మ్యాచ్ లు గెలిపించిన సందర్భాలున్నాయి. ఇక గ్రౌండులో ఎంతో సరదాగా ఉంటూ, మ్యాచ్ లో ఒత్తిడన్నది లేకుండా చేస్తాడు. అలాగే బౌలింగులో తనదైన రోజున అద్భుతంగా బాల్ ని తిప్పుతాడు.
Also Read: పాకిస్తాన్ పై గెలుపు.. అమ్మాయిల ఆసియా కప్ లో.. భారత్ బోణీ
బ్యాటింగులో కూడా ఎన్నో క్లిష్టమైన సందర్భాల్లో బ్యాటింగు చేసి, జట్టుని ఆదుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అలాంటి జడేజాను నేడు పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీనంతటికి కోచ్ గంభీర్ కారణమని అంటున్నారు. టీ 20 వరల్డ్ కప్, 2027 వన్డే వరల్డ్ కప్ లను దృష్టిలో పెట్టుకుని టీమ్ ని ఇప్పటి నుంచి తయారుచేస్తున్నాడని అంటున్నారు.
యువ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, శివమ్ దూబే అద్భుతంగా రాణిస్తుండటంతో ఇకపై టీమిండియాలో జడేజా కనిపించే అవకాశాలు లేవని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్టింట మంట రేగుతోంది. రవీంద్ర జడేజాలాంటి స్ఫూర్తిదాయక ఆటగాడికి ఇలా ఉద్వాసన పలకడం సరైంది కాదని అంటున్నారు. అయితే టెస్టు మ్యాచ్ లకి తనని పరిగణలోకి తీసుకోవచ్చునని కొందరంటున్నారు.