Hyderabad Hussain Sagar reached dangerous Level
విశ్వనగరానికి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా చెప్పుకునే హుస్సేన్ సాగర్ జలాశయం ప్రమాద కర స్థాయికి చేరుకుంది. చుట్టుపక్కల రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని పరిసర ప్రాంతాల జనాలను భయపెడుతోంది. ఏ అర్థరాత్రి గట్టు తెగుతుందో అని దోమల్ గూడ,అశోక్ నగర్,గాంధీనగర్ వాసులు కలవరపడుతున్నారు. అయితే అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. అలాంటి పరిస్థితి వస్తే చుట్టుపక్కల ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామంటున్నారు. కాగా ఈ నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నామని..మూషీ నదిలో వదిలే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు.
పూర్తి స్థాయి నీటి మట్టం
వాస్తవానికి హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు. ప్రస్తుతం అది 514.75 మీటర్లకు చేరుకుంది. గంటగంటకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. పైగా శనివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కబిక్కు మంటున్నారు. హుస్సేన్ సాగర్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణతో అధికారులు అప్రమత్తమయ్యారు. సూచిక బోర్డు వద్ద జీహెచ్ ఎంసీ సిబ్బంది వెయ్యి కళ్లతో కాపలా కాస్తున్నారు. ఒకప్పుడు నిజాం నవాబుల కాలంలో హుస్సేన్ సాగర్ జలాలను మంచి నీరుగా స్వీకరించేరు ప్రజలు. కాలక్రమంలో జనాభా పెరగడంతో డ్రైనేజీ వాటర్ సజావుగా పోయేందుకు నాలా ఏర్పాటు చేశారు. సిటీ మధ్యలో అనేక మలుపులు తిరుగుతూ నాలా నీరు హుస్సేన్ సాగర్ కు చేరుకుంటుంది.
హుస్సేన్ సాగర్ శుద్ధి ఎప్పుడు?
చాలా కాలంగా హుస్సేన్ సాగర్ నీటిని శుద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిపాదనలన్నీ కాయితాలకే పరిమితం అవుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు మారినా హుస్సేన్ సాగర్ మాత్రం ఎవరికీ పట్టనట్టు తయరయింది. చుట్టు పక్కల మాత్రం అద్ధుతమైన శిల్పాలు, వనాలు, బూటు ప్రయాణాలు, మధ్యలో బుద్ధుడి విగ్రహం..పర్యాటకులకు ఆకర్షణీయ కేంద్రంగా తయారయింది. అయితే అప్పుడప్పుడు హుస్సేన్ సాగర్ లో వెలువడే దుర్గంధంతో పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.