TMC : గుజరాత్ పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ కీలక నేతను అదుపులోకి తీసుకున్నారు. టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలేను రాజస్థాన్లో అదుపులోకి తీసుకొని గుజరాత్కు తరలించారు. సాకేత్ గోఖలే అరెస్ట్ ను రాజకీయ కక్షసాధింపు చర్యగా టీఎంసీ పేర్కొంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ట్విటర్ ద్వారా తెలిపారు. సాకేత్ జైపూర్ వెళుతుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. గతంలో మోర్బీ వంతెన దుర్ఘటనపై చేసిన ట్వీట్ల కారణంగానే ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.
సాకేత్ గోఖలే సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఆ విమానం రాజస్థాన్లో ల్యాండ్ అవ్వగానే అప్పటికే అక్కడ వేచ్చి ఉన్న గుజరాత్ పోలీసులు సాకేత్ ను అదుపులోకి తీసుకొన్నారు. తెల్లవారు జామున రెండు గంటల సమయంలో సాకేత్ తల్లికి ఫోన్ చేసి తనను అహ్మదాబాద్ తీసుకెళుతున్నారని వెల్లడించారు. అనంతరం అతడి ఫోన్.. ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మోర్బీ వంతెన కూలిన ఘటనపై అతడు చేసిన ట్వీట్లను దృష్టిలో పెట్టుకొని అక్రమకేసును బనాయించారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు బీజేపీ పాల్పడుతోందని మండిపడ్డారు. మరోవైపు సాకేత్ అరెస్టు పై జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో దిగ్పాల్ సింగ్ స్పందించారు. అతడి అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గేఖలే అరెస్ట్ తో బీజేపీ,టీఎంసీ మధ్య మరోసారి వార్ మొదలైంది.