Cargo ship Fire Near Goa| ప్రమాదకర పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న కార్గో షిప్పులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం గోవా తీరానికి సమీపంలో జరిగిందని ఇండియాన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) అధికారులు తెలిపారు.
గోవా తీరానికి 102 నాటికల్ మైల్స్ (190 కిలోమీటర్ల) దూరంలో ఎంవీ మెయర్స్క్ ఫ్రాంక్ ఫర్ట్ కార్గో షిప్పులో అగ్ని ప్రమాదం జరిగింది. గుజరాత్ లోని ముంద్రా పోర్టు నుంచి శ్రీలంక కొలంబోకు బయలుదేరిన ఈ కార్గో షిప్పులో ప్రమాదకర పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారిక సమాచారం. ఈ షిప్పులో మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది ఫిలిపీన్స్ పౌరులు, ఇద్దరు యుక్రెయిన్ పౌరులు, ఒకరు రష్యన్, ఒకరు మాంటెనెగ్రోకు చెందిన వారున్నారు. అయితే సిబ్బందిలో ఫిలిపీన్స్ పౌరుడు కనిపించడం లేదని సమాచారం.
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంనే ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అగ్నిమాపక చర్యలు చేపట్టేందుకు మూడు అగ్నిమాపక షిప్పులు, ఒక డార్నియర్ మేరిటైమ్ పాట్రోలింగ్ విమానాన్ని ఘటనా స్థలానికి పంపించింది.
కార్గో షిప్పులో ముందు భాగంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఐసిజి అధికారులు తెలిపారు. అయితే సముద్రంలో నైరుతి వర్షాల కారణంగా భారీ అలజడి ఉందని, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం. అగ్నిమాపక చర్యల్లో భాగంగా ఐసిజికి చెందిన మూడు షిప్పులు అగ్ని జ్వాలలను ఆర్పేందుకు నీరు, ఏఖియస్ ఫిల్మ్ కెమికల్ ఫోమ్ని ఉపయోగిస్తున్నారు.
షిప్పులో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. అగ్నిప్రమాదం జరిగిన షిప్పులో పేలుడు పదార్థాలతో పాటు 1400 మెట్రిక్ టన్నుల డీజిల్ ఉండడం ఆందోళనకర విషయమని ఐసిజి అధికారులు అన్నారు.