India vs Pakistan Women’s Asia Cup T20 2024 Highlights: పాకిస్తాన్ పై మ్యాచ్ అంటేనే హైఓల్టేజి మ్యాచ్ గా అందరూ అభివర్ణిస్తారు. అలా టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా అదరగొట్టింది. అలాగే లెజండ్స్ ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాక్ పై గెలిచి టీమ్ ఇండియా కప్ సాధించింది. నేడు జరుగుతున్న మహిళల ఆసియా కప్ లో కూడా గ్రూప్ దశలో పాకిస్తాన్ ను ఓడించి భారత్ ముందడుగు వేసింది.
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ లో గ్రూప్ ఏ లో పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. 19.2 ఓవర్లలో 108 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 14.1 ఓవర్లలో 109 పరుగులు చేసి విజయ దుందుభి మోగించారు.
వివరాల్లోకి వెళితే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు గుల్ పిరోజా (5), మునీబా అలి (11) ఇద్దరూ తక్కువ స్కోరుకి అవుట్ అయిపోయారు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన సిద్రా అమీన్ (25), తుబా హస్సన్ (22), ఫాతిమా సనా ( 22) ఈ ముగ్గురూ ఒక మోస్తరుగా ఆడారు. మిగిలిన అందరూ చేతులెత్తేశారు. దీంతో 19.2 ఓవర్లలో 108 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.
టీమ్ ఇండియా బౌలింగులో రేణుకా సింగ్ 2, పూజా వస్త్రాకర్ 2, దీప్తీ శర్మ 3, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 109 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా సాధికారికంగా ఆడింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (40), స్మ్రతి మంథాన (45) అద్భుతంగా ఆడి బలమైన పునాదులు వేశారు. 85 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. తర్వాత వడివడిగా ఆడే క్రమంలో దయాలన్ హేమలత (14) అవుట్ అయిపోయింది.
Also Read: సానియామీర్జాతో పెళ్లిపై నోరు విప్పిన క్రికెటర్ షమీ
అనంతరం కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ (5), జెమిమా (3) విజయానికి కావల్సిన పరుగులు చేసి, లాంఛనం పూర్తి చేశారు. 14.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి భారత్ విజయ లక్ష్యాన్ని పూర్తి చేసింది.
పాకిస్తాన్ బౌలింగులో సైదా 2, నష్రా సంధూ 1 వికెట్ పడగొట్టారు.