CM Reventh reddy announced Rajeev Gandhi abhaya hastam scheme
దేశవ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షలలో తెలంగాణ విద్యార్థులు సివిల్ ప్రిలిమ్స్ కు ఎంపిక కావడం గర్వించదగిన విషయం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం ప్రజాభవన్ లో సివిల్ పరీక్షలకు హాజరై ప్రిలిమ్స్ కు అర్హత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపును రూ.లక్ష సాయం అందించేలా ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం. ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం‘ పేరుతో ఈ పథకం ఆరంభించారు.
సివిల్స్ విద్యార్థులతో ముఖాముఖి
సివిల్స్ లో అర్హత సాధించిన విద్యార్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షల నిర్వహణలో గత పాలకుల హయాంలో జరిగిన తప్పులను సరిదిద్ది పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏటా యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీ పరీక్షలను నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. విద్యార్థుల కోరిక మేరకు గ్రూప్ పరీక్షలను వాయిదా వేశామని అన్నారు. పదేపదే పరీక్షలు వాయిదా వేయడం మంచి పద్దతి కాదని ఈ సందర్భంగా సూచించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 లోగా ఉద్యోగాల ప్రకటన ఇస్తామని తెలిపారు.
జాబ్ క్యాలెండర్
త్వరలో జరగనున్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కట్టుబడి ఉంటుందని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నిరుద్యోగుల సేవలను తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు. సింగరేణి ఆర్థిక సాయం ద్వారా తెలంగాణలో సివిల్స్ లో ప్రిలిమ్స్ కు అర్హత సాధించిన విద్యార్థులకు ఇకపై లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అలాగే మెయిన్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు . ఉచిత కోచింగ్ తో పాటు నెలకు రూ.5 వేల చొప్పున వారికి స్టయిఫండ్ అందిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు అధికారులు అందజేస్తారని తెలిపారు.