Bangladesh violence effect Indians come back
బంగ్లాదేశ్ లో ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. అక్కడ హింసాత్మక సంఘటనతో పలు దేశాలనుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న వారు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ఎటునుంచి వాటిల్లనుందో అని బిక్కుబిక్కు మంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక ఘటనలలో పలువురు మృత్యువాత పడ్డారు. భారత విదేశాంగ శాఖ అప్రమత్తమయింది. భారత పౌరులను సురక్షితంగా వాళ్ల దేశాలకు పంపించాలని బంగ్లాదేశ్ ను కోరింది. భారత్ అభ్యర్థన మన్నించిన బంగ్లా ప్రభుత్వం ఇప్పటిదాకా 450కి పైగా భారత పౌరులను ఇండియాకు పంపించింది.
భారత పౌరులకు బంగ్లా భరోసా
భారత పౌరులే కాకుండా నేపాల్, భూటాన్ విద్యార్థులు కూడా భారత సరిహద్దులలోని మేఘాలయ కు చేరుకుంటున్నారు. బంగ్లాదేశ్ లో తమకు భద్రత లేదని వీరు భావిస్తున్నారు. భారత్ కు వచ్చిన విద్యార్థులలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే కావడం విశేషం. తమ దేశంలో ఉద్యోగం, చదువుల నిమిత్తం వచ్చిన వివిధ దేశాల పౌరులకు బంగ్లా ప్రభుత్వం భరోసా ఇస్తోంది. విదేశీ పౌరుల విషయంలో సెక్యూరిటీని మరింత పెంచామని..త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటోంది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనలకూ గురికావద్దని విద్యార్థులను బంగ్లా ప్రభుత్వం అభ్యర్థిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని..ఆందోళనలు చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. బంగ్లాదేశ్ లో ఉంటున్న భారతీయులలో ఎక్కువ మంది జమ్ము కాశ్మీర్, యూపీ, మేఘాలయ, హర్యానా ప్రాంతాలనుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు.