BRS Party Income: బీఆర్ఎస్ పార్టీకి నిధులు డోకా లేదా? దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా ఖర్చు పెట్టే స్థోమత ఆ పార్టీకి ఉందా? ఆ పార్టీకి ఆదాయం భారీగా ఉందా? ఖర్చుల మాటేంటి? తెలంగాణలో ఏ ఇద్దరు రాజకీయ నేతలు మాట్లాడుకున్నా.. కారు పార్టీకి నిధుల సమస్య లేదని ఓపెన్గా చెప్పారు.. చెబుతున్నారు కూడా. ఇది ముమ్మాటికీ నిజమని తేలింది. తాజాగా 2022-23 ఏడాదికి దేశవ్యాప్తంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన నిధులు, వారి ఖర్చు పెట్టిన తీరు చూస్తుంటే.. బీఆర్ఎస్ది అగ్రస్థానం.
2022-23 ఏడాదికి సంబంధించి రాజకీయ పార్టీలకు వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలను బయట పెట్టింది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ -ఏడీఆర్. ఆదాయం జాబితాలో బీఆర్ఎస్ పార్టీ అగ్ర స్థానంలో నిలిచింది. ఆర్థిక సంవత్సరంలో కారు పార్టీకి 737.67 కోట్ల రూపాయలు వచ్చినట్టు తేల్చింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు తమ ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించాయి. దాని ఆధారంగా దాదాపు 39 ప్రాంతీయ పార్టీల వచ్చిన మొత్తంలో బీఆర్ఎస్కు వచ్చిన ఆదాయం 42 శాతానికి సమానంగా అభిప్రాయపడింది. అయితే ఖర్చు విషయంలో మూడో స్థానంలో నిలిచింది. కేవలం 57.47 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు ఆ రిపోర్టులో తేలింది.
ఖర్చు చేసిన టాప్-5 రాజకీయ పార్టీలను పరిశీలిద్దాం. బెంగాల్కి చెందిన అధికార టీఎంసీ పార్టీకి వచ్చిన ఆదాయం 333.45 కోట్ల రూపాయలు కాగా అందులో 181.18 కోట్లను ఖర్చు చేసి తొలి స్థానంలో నిలిచింది. అంటే వచ్చిన ఆదాయంలో ఖర్చు చేసింది కేవలం 37శాతం అన్నమాట. ఆ తర్వాత ప్లేస్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వైఎస్ఆర్సీపీ 79 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. 16 శాతం ఖర్చు చేసింది.
థర్డ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది కేవలం 57 కోట్ల రూపాయలను ఖర్చులు చేసినట్టు తేలింది. దాదాపు 12శాతం అన్నమాట. ఖర్చులు పోను అత్యధికంగా 680 కోట్ల రూపాయలు మిగిలినట్టు ఏడీఆర్ఎ లెక్క. ఆ తర్వాత డీఎంకె -52 కోట్ల రూపాయలు 11శాతం, సమాజ్వాదీ పార్టీ-31 కోట్లరూపాయలు ఖర్చు చేసినట్టు తేలింది. అంటే దాదాపు ఆరున్నర శాతం అని లెక్కలు చెబుతున్నాయి.
ALSO READ: ఈ సారైనా కేసీఆర్ గళం అసెంబ్లీలో వినిపిస్తుందా?
39 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఆదాయం 1740 కోట్ల రూపాయలు కాగా, అందులోని మొదటి ఐదు పార్టీల ఆదాయం 1541 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు తెలిపింది. పొరుగున ఉన్న కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి ఆదాయం కంటే ఖర్చులు 490శాతం ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు వచ్చిన నిధులు కేవలం స్వచ్ఛంధ విరాళాలు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే ఆదాయం వచ్చిందనేది ఏడీఆర్ విశ్లేషణ.