Telangana assembly session updates(Telangana politics):
వరుస ఎన్నికలలో ఓటమి, వలస బాట పట్టిన నేతలతో బీఆర్ఎస్ నేత కుదులైన తరుణంలో ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా అని అంతా ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో 14న బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో 25న రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ సమాయాత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు కేటాయించే నిధులను బట్టి రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. అయితే బడ్జెట్ సమావేశాలలో ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ తదితర అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.
పట్టుబడుతున్న శ్రేణులు
ఎలాగైనా ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నారు. తమ నేత అధికార పక్షాన్ని తన మాటల వాగ్దాటితో ఎలా ఎదుర్కుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా తన స్థానంలో ఏనాడూ కూర్చోలేదు కేసీఆర్. కేవలం ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. మొదటి సమావేశాలకు అనారోగ్యం రీత్యా రాలేకపోయిన కేసీఆర్ కనీసం రెండవ సారి అయినా హాజరవుతారని అంతా భావించారు. అప్పుడు కూడా వారి ఆశ తీరలేదు.
కేసీఆర్ రావాలని సూచన
పార్టీ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతేనే మంచిదని భావిస్తున్నారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపేందుకు అవకాశం ఉంటుందని..అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ తన వాగ్దాటితో అధికార పక్ష నేతలను ధీటుగా ఎదుర్కోగలరని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. కేసీఆర్ కూడా ఇకపై తాను అజ్ణాతంలో ఉంటే పార్టీకి తీరని నష్టం వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో కాలు మోపి వాడిగా వేడిగా అధికార పక్షాన్ని ఎదుర్కోవాలని చూస్తున్నారు.
అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోవాలని..
రాష్ట్రంలో అసంతృప్తితో ఉన్న నిరుద్యోగుల తరపున, రైతు భరోసా పేరిట వారి తరపున, ఆరు హామీల అమలు తీరుపైనా రేవంత్ సర్కార్ పై తనదైన శైలిలో కేసీఆర్ విరుచుకుపడాలని సూచిస్తున్నారు. మరో పక్క రేవంత్ అసెంబ్లీ సమావేశాలలోకా బీఆర్ఎస్ ఖాళీ అవబోతోందని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు కనీసం ఉన్న ఎమ్మెల్యేలోనైనా కాపాడుకోవాలని..అందుకు కేసీఆర్ రంగంలోకి దిగి అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష నేతగా విజయవంతం చేయాలని అంతా కోరుతున్నారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరో 16 మంది చేరితే బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కోల్పోతుంది.
విలీనం దిశగా..
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి న్యాయపరంగా వారిని ఎదుర్కోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. పార్టీలో మొత్తం ఎమ్మెల్యేలను చేర్చుకుని విలీనం చేసుకుంటే వారిపై అనర్హత వేటు పడకుండా చూడవచ్చు. అందుకే కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ విలీనం కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో కేసీఆర్ ఇదే పద్దతిలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే యోచనతో విలీన ప్రక్రియ వేగవంతం చేస్తోంది. ఇలాంటి క్లిష్టకర పరిస్థితిలో కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టడమే సరైనదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. గులాబీ బాస్ కూతా తన మనసు మార్చుకుని అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సమాయాత్తమవుతున్నట్లు సమాచారం.