Murder : ఓ ఉన్మాది బరితెగించాడు. పెళ్లికి నిరాకరించిందని బీడీఎస్ విద్యార్ధినిని దారుణంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో జరిగింది. సర్జికల్ బ్లేడ్తో గొంతుకోసి కొనఊపిరితో ఉండగా ఒక గది లోంచి మరో గదిలోకి ఈడ్చుకుంటూ వెళ్లి తలుపులు బిగించాడు. స్థానికులు బాధితురాలిని బయటకు తీసుకొచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
బీడీఎస్ విద్యార్థిని తపస్విది కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామం. తపస్వి తల్లిదండ్రులు ముంబయిలో ఉంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఆమెకు ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్ తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. తపస్వి విజయవాడలోని ఓ వైద్య కళాశాలలో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. జ్ఞానేశ్వర్ సాప్ట్వేర్ ఇంజనీర్. వీరిద్దరూ కొంతకాలం గన్నవరంలో ఉన్నారు.
ప్రేమ విషయంలో విభేదాలు రావటంతో అతనిపై గతంలో తపస్వి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా సరే జ్ఞానేశ్వర్ నుంచి ఇబ్బందులు ఎదురుకావడంతో తక్కెళ్లపాడులో ఉన్న తన స్నేహితురాలికి ఈ విషయాన్ని చెప్పింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇద్దరినీ ఆమె తన ఇంటికి పిలిపించింది. ఈ సమయంలో జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడ్ తో తపస్విపై దాడికి తెగబడ్డాడు. స్నేహితురాలు కేకలు పెడుతూ ఇంటి యజమానికి విషయం చెప్పింది. ఈ లోపే గది తలుపులు బిగించి అత్యంత దారుణంగా తపస్విపై నిందితుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్థులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి నిందితుడిని బంధించారు. కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయినా ఆమె ప్రాణాలు దక్కలేదు.
తాను వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటున్నానని మాటల సందర్భంలో తపస్వి చెప్పగానే ఆ యువకుడు ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు బ్లేడ్తో తన చేతిపై గాయం చేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.