Ponnam Vs Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేసిందని, అందులో భాగంగా నిన్నటి వరకు లక్ష రూపాయల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే రూ. లక్షా 50 వేల వరకు, ఆగస్టు లోపు రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. కానీ, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉందని విమర్శించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించడం లేదంటున్న బండి సంజయ్.. అది నిరూపించకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అని సవాల్ విసిరారు. రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారతదేశ చరిత్రలోనే రూ. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తుంటుంటే.. దానిని భరించలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి రైతులకు ఆత్మహత్యలకు కారణమైన మీరా మాట్లాడేదంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతుంటుంటే సమర్థించాల్సింది పోయి.. విమర్శిస్తున్నారంటే అది మీ కుహనా బుద్ధి అని తమకు అర్థమవుతుందన్నారు. మీరు కేంద్రం నుండి రాష్ట్రానికి, రైతులకు ఏం తెస్తారో తెలంగాణ ప్రజలకు వివరించాలన్నారు.
Also Read: అమెరికాకు సీఎం రేవంత్..షెడ్యూల్ ఇదే
రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసిన మీకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా ? అంటూ బండి సంజయ్ను ప్రశ్నించారు. గుజరాత్లో భారీ వర్షాలు కురిస్తే రూ. వందల కోట్లు కేటాయించిన మీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం భారీ వర్షాలకు పంట నామ రూపల్లేకుండా పోతే పంట నష్ట పరిహారం ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. తక్షణమే బండి సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలంటూ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. 2019 మీ ఎన్నికల మేనిఫెస్టోలో 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు.. ఎంతమందికి ఇచ్చారు..? రైతుల మీద ఫసల్ భీమా భారాన్నిపెంచారు.. ఎరువుల సబ్సిడీలో రూ. 75 వేల కోట్లు కోత పెట్టారు.. కాంప్లెక్స్ ఎరువుల ధరలను రెట్టింపు చేశారు.. అగ్రికల్చర్ సెస్ పేరుతో పంట ఖర్చులు పెంచారంటూ మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ వ్యవహార శైలి చూస్తుంటే ‘గురివింద గింజ నలుపెరుగదు’ అనే సామెత గుర్తొస్తుందన్నారు. రైతులకు జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రశంసించే ప్రయత్నం చేయండి..అంతే తప్ప రైతులకు సంబంధించిన ఈ మంచి కార్యక్రమాన్ని విమర్శించే ప్రయత్నం చేయవద్దంటూ కేంద్రమంత్రికి ఆయన సూచించారు.