YS Sharmila Game Changer In AP Politics: గత ఎన్నికల్లో పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగింది కాని.. సీట్లు దక్కలేదు. అయినా భవిష్యత్తుపై ఏపీ కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావంతోనే కనిపిస్తున్నాయి. వైసీపీ దారుణ పరాజయం పాలవ్వడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ స్థానాన్ని తాము ఆక్రమిస్తామని షర్మిల కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ఉన్న కొందరు మాత్రం ఎన్నికల తర్వాత ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిపై వేటు పడటంతో కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ఆర్ కుమార్తెపై ఎంత నమ్మకం పెట్టుకుందో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. ముక్కుసూటిగా, కుండబద్ధలు కొట్టినట్టుగా అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలో ఆమెకు ఆమే సాటి తెలంగాణలో కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఆమె సవాలు చేశారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసిరారు. ఇక ఇప్పుడు అన్న జగన్ వంతు వచ్చింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడే చీల్చిచెండాడిన ఆమె.. అతను మాజీ అయ్యాక కూడా వదలడం లేదు.
కాంగ్రెస్ గూటికి చేరాక కూడా ఆమె రాజకీయ శైలిలో ఎలాంటి అదురుబెదురు కనిపించడం లేదు. సుస్పష్టమైన రాజకీయ వైఖరిని ఆమె కనబర్చుతున్నారు. సీఎం సీటులో సొంత అన్న కూర్చున్నప్పటికీ ఆమె కచ్చితమైన రాజకీయ వైఖరిని ప్రదర్శించారు. విభజన తర్వాత ఏపీలో అచేతనంగా మారిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడంతో షర్మిల సక్సెస్ అవుతున్నారు.
వైఎస్కు కాంగ్రెస్తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .. అందుకే ఆయన వారసురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించింది .. రాష్ట్ర కాంగ్రెస్లో ఎంత మంది సీనియర్లు ఉన్న షర్మిలను పీసీసీ అధ్యక్షురాలని చేసింది. కేంద్ర కాంగ్రెస్ వద్ద ఆమెకు ఉన్న పలుకుబడి ఎంతో ఒక్క సంఘటనతో తెలిసి వచ్చింది. ఎన్నికలు అయిపోయాక వైఎస్ షర్మిల మీద ఘాటు విమర్శలు చేస్తూ ఏకంగా మీడియాకు ఎక్కిన ఇద్దరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో సహా మొత్తం నలుగురిని తొలగిస్తూ ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం తాజాగా చర్యలు తీసుకుంది.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జంగా గౌతమ్, మస్తాన్ వలీల పదవులు పోయాయి ఇందులో పద్మశ్రీ, రాకేష్ రెడ్డి మాత్రమే షర్మిల మీద బాహాటంగా కామెంట్స్ చేశారు. పద్మశ్రీ అయితే హై కమాండ్ ఇచ్చిన ఎన్నికల ఫండ్స్ సరిగ్గా ఖర్చు చేయలేదని షర్మిల మీద తీవ్ర ఆరోపణలు చేసారు. ఆమె పనితీరుని సైతం ప్రశ్నించారు. అలాగే రాకేష్ రెడ్డి కూడా షర్మిల వల్ల ఉపయోగం లేదన్నట్లుగా మాట్లాడారు. వారి మీద షర్మిల కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయంలో సీరియస్ అయింది.
ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం వారి మీద చర్యలు తీసుకుంది. వారు షర్మిలను విమర్శించిన వీడియో క్లిప్పులు అధిష్టానానికి చేరాయంటున్నారు. ఈ చర్యతో కేంద్ర కాంగ్రెస్ పెద్దలు తాము పూర్తిగా షర్మిల వైపే ఉన్నట్లు అని స్పష్టం చేసినట్లు అయింది. వాస్తవానికి కాంగ్రెస్ పెద్దలను ధిక్కరించే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ మరణానంతరం తనను సీఎం చేయలేదని జగన్ వైసీపీ స్థాపించి సోనియాగాంధీపైనే విమర్శలు గుప్పించారు. ఆ ఎఫెక్ట్తో వైసీపీ కాంగ్రెస్కు బద్ద శత్రువుగా మారిపోయింది.
Also Read: జగన్ ను అడ్డుకున్న ఏపీ పోలీసులు..అక్కడికి వెళ్లొద్దని వార్నింగ్
2014 ఎన్నికల్లో వైసీపీకి 63 సీట్లు దక్కాయన్నా 2019లో 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారన్నా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చలవే అని చెప్పాలి. తండ్రి సెంటిమెంట్ని వాడుకున్న జగన్ కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓటుబ్యాంకుని తిప్పుకోగలిగారు. ఇప్పుడా ఓటు బ్యాంకుని రాబట్టుకోవడం కాంగ్రెస్ ముందు ఉన్న పెద్ద టాస్క్. ఆ సంప్రదాయ ఓటు బ్యాంకు తిరిగిరావాలంటే వైసీపీ సోదిలో ఉండకూడదు. ఆ క్రమంలో ఏపీలో వైసీపీని నిర్వీర్యం చేసే సామర్ధ్యం షర్మిలకు మాత్రమే ఉందని కాంగ్రెస్ నమ్ముతోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వైఎస్ జయంతి వేడుకలను ఏపీలో కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది. తెలంగాణా సీఎం రేవంత్రెడ్డి సహా కీలక నేతలంతా దానికి హాజరయ్యారు. దాంతో షర్మిల ఇమేజ్ మరింత పెరిగింది. ఆమె మాత్రమే వైఎస్ వారసురాలు అని రుజువైందంటున్నారు. వైఎస్ జయంతి రోజున జగన్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు షర్మిల.. వైఎస్కు అసలు జగన్ వారసుడే కాదని తేల్చేశారు.
కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన అండదండలతోనే షర్మిల ఏపీలో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గా ఉన్న పద్మశ్రీ రాకేష్ రెడ్డిలు అలవాటైన కాంగ్రెస్ కల్చర్తో పార్టీ ఓడిన తరువాత పీసీసీ చీఫ్ మీద విమర్శలు చేస్తే ఆమెను మారుస్తారు అని భావించారు. కానీ వారి పదవులకే ఎసరు వచ్చింది. ఒక విధంగా ఇది మిగిలిన కాంగ్రెస్ నేతలకు కూడా హెచ్చరిక అంటున్నారు. మొత్తానికి ఏపీ వరకూ షర్మిల సుప్రీం అని తేల్చేసింది కాంగ్రెస్ హైకమాండ్.