Has Mumbai’s captaincy controversies become a curse for Hardik Pandya: నిన్నమొన్నటి వరకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అంటూ నెట్టింట సందడి మొదలైంది. ఆల్రడీ బీసీసీఐ కూడా అంతర్గతంగా అదే మాట చెబుతూ వచ్చింది. కానీ సడన్ గా అటు వన్డే, ఇటు టీ 20లో కూడా కెప్టెన్సీ లేకుండా చేసింది. అతను తరచూ గాయాలపాలవడం, ఫిట్ నెస్ సమస్యలు, ముఖ్యంగా ముంబయి గొడవల కారణంగా కెప్టెన్సీ చేజారిపోయిందని అంటున్నారు.
నిజానికి పాండ్యాలోని ఆటని, దేశం పట్ల అంకితభావాన్ని తక్కువ చేసి చూడలేం. అతనిలో ఆ కసి, పట్టుదల లేకపోతే టీ 20 ప్రపంచకప్ వచ్చేదే కాదు. నిజానికి లీగ్ దశలో తన ఆల్ రౌండ్ ప్రదర్శన వల్ల టీమ్ ఇండియా గెలిచిందనే సంగతి మరువకూడదు. తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఏకంగా ఫైనల్ లో ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించి, కప్ అందుకునేలా చేశాడు. ఇలా మూడు దశల్లో తన మార్కు ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకంగా మారాడు.
టీ 20 ప్రపంచకప్ ఫైనల్ లో ఒకవైపు నుంచి క్లాసెన్ దంచికొడుతుంటే, 99శాతం అందరూ ఆశలు వదిలేసుకున్నారు. అలాంటి వేళ హార్దిక్ తనని అవుట్ చేసి మ్యాచ్ ని ఇండియావైపు మలుపు తిప్పాడు. తర్వాత మిగిలిన ఏకైక బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కి వేసిన బాల్ ని సూర్య కుమార్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇవి రెండు హార్దిక్ నుంచి వచ్చినవే. ఆ రెండు బంతులే టీ 20 ప్రపంచకప్ ను ఇండియాకు తీసుకొచ్చాయి. మొత్తమ్మీద పాండ్యా టీ 20 ప్రపంచకప్ లో 6 ఇన్నింగ్స్ లో 11 వికెట్లు తీశాడు. 144 పరుగులు చేశాడు.
Also Read: కొత్త, పాతల కలయికతో టీమ్ ఇండియా
అలాంటి పాండ్యాకి గాయాల పేరు చెప్పి, కెప్టెన్సీ నిరాకరించడం సరికాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తను పనిచేసిన కోల్ కతా టీమ్ పై కోచ్ గంభీర్ ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్నాడని అంటున్నారు. పనిలో పనిగా తనని తిట్టిపోస్తున్నారు. మరోవైపు ముంబయి కెప్టెన్సీ వివాదాల వల్ల కూడా తనకి ఇవ్వలేదని అంటున్నారు. ఎందుకంటే అక్కడ గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించాడని, అవి టీమ్ ఇండియాలోకి తీసుకువస్తే ప్రమాదమనే ఉద్దేశంతో పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది.