Hyderabad DGP warns public about fake DP of Police calls
రోజుకో సరికొత్త టెక్నిక్ తో మోసం..పోలీసులకు సైతం అర్థం కాని సాంకేతిక పరిజ్ణానంతో సైబర్ నేరగాళ్లు సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారు. దీనిపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా పబ్లిక్ తీరు మారడం లేదు. వీళ్లు ఎప్పుడు ఎలా..ఏ రూట్ లో పబ్లిక్ ను మోసం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. తీరా అర్థం అయ్యేసరికి తాము మోసపోయామని తెలుసుకుంటున్నారు. తమ డబ్బులు అకౌంట్ లో ఖాళీ అయ్యాక గానీ మోసపోయామన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.
అపరిచిత కాల్స్
మొన్నటిదాకా కొన్ని అపరిచిత కాల్స్ వచ్చేవి పబ్లిక్ కు. పోలీసు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని..డ్రగ్స్ పార్సిల్ వచ్చిందంటూ అది ఇంటర్నేషనల్ క్రైమ్ అని పట్టుబడితే పరువు పోతుందని చెప్పి ఎంతో కొంత డబ్బులు బేరం కుదుర్చుకుని కేసును మాఫీ చేస్తామని నమ్మ బలికేవారు. ఇప్పుడు ఇటువంటి కాల్స్ ఎవరూ నమ్మడం లేదు. ఫేక్ కాల్స్ కింద లైట్ గా తీసుకుంటున్నారు. దీనితో సైబర్ నేరస్థులు మరో ముందడుగు వేసి జనాన్ని ఈజీగా నమ్మిస్తున్నారు.
ఏకంగా పోలీసు డీపీతో మోసం
కొందరు పోలీసు అధికారుల ఫొటోలను సంపాదించి తమ మొబైల్స్ లో డీపీ ఫొటో పెట్టుకుంటున్నారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని ట్రూ కాలర్ లో చూస్తే అతని డీపీని చూసి నిజంగానే పోలీసు డిపార్టు మెంట్ అని జనం నమ్ముతున్నారు. విదేశాలనుంచి మీకు పార్సిల్ వచ్చిందని, లేదా టెర్రరిస్టులకు వీళ్ల బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు అందాయని వెంటనే పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోవాలని బెదిరిస్తున్నారు. లేదంటే సైలెంట్ గా వాళ్ల ఎకౌంట్ కు వాళ్లడిగిన డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది పరువు పోతుందని భయపడి వాళ్లు అడిగిన డబ్బులు వేస్తున్నారు. డీపీలను చూసి మోసపోవద్దని పబ్లిక్ కు డీజీపీ ట్విట్టర్ ద్వారా హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న అలాంటి డీపీ కాలర్స్ ను స్క్రీన్ షాట్ తీసి పబ్లిక్ ను హెచ్చరిస్తున్నారు. డీపీలను చూసి మోసపోకండని చెబుతున్నారు డీజీపీ.
ఫేస్ బుక్ లో మనగురించి స్టడీ
సైబర్ నేరగాళ్లు ముందుగా ఫేస్ బుక్ లో లాగిన్ అవుతారు. మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. మన పర్సనల్ ఫొటోలను చూసి మన స్టేటస్ తెలుసుకుంటారు. పొరపాటున మనం ఎవరికైనా మన నెంబర్ ఫార్వార్డ్ చేశామో వాళ్లకి దొరికిపోతాము. ఇక ఫోన్ కాల్స్ ను ట్రాప్ చేసి ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్ బుక్ లో మన అకౌంట్ ను హ్యాక్ చేసి మనకి తెలిసిన వాళ్లందరికీ డబ్బులు కావాలని రిక్వెస్ట్ పెడుతున్నారు. నిజంగానే అనుకుని కొందరు వాళ్లు ఇచ్చిన ఫోన్ పే నంబర్లకు డబ్బులు పంపుతున్నారు.
ప్రజలే అప్రమత్తంగా ఉండాలి
సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త టెక్నిక్ లతో ఈజీగా డబ్బులు సంపాదించుకునే నేరగాళ్లు ఎక్కువైపోతున్నారు .పోలీసు కంప్లెయింట్ ఇచ్చినా సదరు నేరస్తుడు దొరకడు. దీనితో పోలీసులు కూడా ఈ తరహా నేరస్తులను పట్టుకోలేకపోతున్నామని మొత్తుకుంటున్నారు. ప్రజలే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు డబ్బులు వేసే ముందు ఆలోచించుకోవాలని అంటున్నారు. నిజమైన పోలీసులు ఎవరూ అలా డబ్బులు కావాలని, ఫోన్ పే చెయ్యాలని అడగరని..పబ్లిక్ దీనిని సీరియస్ గా తీసుకోవాలని అంటున్నారు.