Tamil Nadu: తమిళనాడులో వారసత్వ రాజకీయాలు మొదలయ్యాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు అధికార డిఎంకె పార్టీలో సన్నాహాలు జోరుగా సాగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తమిళనాడు యూత్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డెవెల్ప్మెంట్ మంత్రిగా కొనసాగుతున్న ఉదయనిధి స్టాలిన్కు త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా ప్రొమోషన్ లభించనుంది. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆగస్టు 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అంతకు ముందే తన కుమారుడు ఉదయనిధిని డెప్యూటీ సీఎం చేస్తారని సమాచారం.
2021 మే నెలలో తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తరువాత డిఎంకె పార్టీ.. యూత్ వింగ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఉదయనిధి స్టాలిన్కు డిసెంబర్ 2022లో తన తండ్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మంత్రివర్గంలో చోటు లభించింది. 2026లో జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె పార్టీకి ఉదయనిధి స్టాలిన్ నాయకత్వం వహించబోతున్నారని.. ఆ ఎన్నికల్లో ఎంకె స్టాలిన్ పోటీ చేయకపోవచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read| Mallikarjun Kharge: ‘రైల్వే ప్రమాదాలు నివారించండి.. వెంటనే కవచ్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేయండి’
లోక్ సభ ఎన్నికల తరువాతే డెప్యూటీ సిఎం పదవి
డిఎంకె పార్టీ నాయకులు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఉదయనిధి స్టాలిన్ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని భావించారు. కానీ జూన్ నెలలో కల్లాకురిచి కల్తీ మద్యం తాగడం వల్ల 65 మంది చనిపోయారు. ఈ ఘటన జరిగిన తరువాత కొత్త ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రకటించడానికి సరైన సమయం కాదని వాయిదా వేశారు.
ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ప్రకటించడమే కాకుండా.. పార్టీ నాయకత్వ బాధ్యతలు కూడా ఆయనే కట్టబెట్టాలని ఎంకె స్టాలిన్ భావిస్తున్నారని సమాచారం. అదే జరిగితే తమిళనాడులో కరుణానిధి మూడోతరం రాష్ట్ర రాజకీయాలను శాసించినట్లుగా మారుతుంది. ఇలా చేయడం వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడమే అవుతుంది. కానీ డిఎంకె పార్టీ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వారసత్వ రాజకీయాలు చేయడం పూర్తిగా వ్యతిరేకం.