Thief Returns Loot| ఓ దొంగ అర్థరాత్రి ఒక ఇంట్లో దూరి.. దొంగతనం చేశాడు. దొంగతనం జరిగిందని పోలీసులకు ఇంటి ఓనర్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. దొంగతనం జరిగిన కొన్ని రోజుల తరువాత ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ దొంగ మళ్లీ వెళ్లి దొంగతనం చేసిన సొమ్ము క్షేమంగా పెట్టేశాడు. దాంతో పాటు ‘మీ ఇల్లు అని తెలీక దొంగతనం చేశాను.. సారీ’ అంటూ లెటర్ కూడా రాసి పెట్టాడు. ఆ దొంగ ఆ ఇంటి ఓనర్ వీరాభిమాని అని తేలింది. ఈ వింత ఘటన మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని రాయిగడ్ జిల్లా నేరల్ నగరంలో ఓ ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంటి యజమానులు పది రోజులుగా ఊళ్లో లేరు. దీంతో సమయం చూసి ఒక దొంగ.. ఆ ఇంట్లో ఉన్న ఎల్ ఈడీ టీవి, ఇతర వస్తువులు దొంగతనం చేశాడు. ఇంటి ఓనర్లు తిరిగి వచ్చాక.. ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుకొని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేశారని ఫిర్యాదు నమోదు కూడా చేసుకున్నారు.
కానీ ఇంతలోనే ఒకరోజు రాత్రి ఇంటి ఓనర్లు బయటికి వెళ్లిన సమయంలో దొంగ తిరిగి వచ్చి తాను దొంగతనం చేసిన ఎల్ ఈడీ టీవీతో పాటు.. దోచుకున్న సామాన్లన్నీ భద్రంగా పెట్టాశాడు. ఆ తరువాత మరాఠీలో ఇంటి ఓనర్లకు లెటర్ రాశాడు. ఈ ఇంటి ఓనర్ కి నేను పెద్ద అభిమానిని.. ఆయన ఇల్లు అని తెలీక తప్పు చేశాను.. సారీ అని రాశాడు.
Also Read: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!
ఓనర్లు.. ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో దొంగతనం జరిగిన సామాన్లన్నీ చూసి షాకయ్యారు. లెటర్ చదివి వారికి విషయం అర్థమైంది. ఆ దొంగ ఎవరి అభిమాని అని. విషయమేంటంటే.. ఆ ఇల్లు పద్మ శ్రీ అవార్డు గ్రహీత మరాఠీ కవి నారాయణ్ సూర్వేది. ఆయన ఒక దళి కవి. మరాఠీ సాహిత్యంలో ఆయన సుప్రసిద్ధ కవి. 2010లో 83 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. దొంగతనం జరిగిన ఇల్లు ఆయనదే. అయితే ఇప్పుడా ఇంట్లో ఆయన కూతురు ఉషా సూర్వే ఉంటోంది.
మరాఠీ కవి నారాయణ్ సూర్వే ఒక అనాథ. ఆయన చిన్నప్పుడు ముంబై వీధుల్లో తిరిగేవాడు. ఒక ఫ్యాక్టరీ కార్మికుడు ఆయనను దత్తత తీసుకున్నాడు. నారాయణ్ సూర్వే కవితలలో పేదల జీవితం.. సమాజంలో వెనుకబడిన వర్గాల కష్టాలు వర్ణన ఉంటుంది. అందుకే ఆయనను దళితులంతా ఆదర్శంగా భావిస్తారు.
తాజాగా జరిగిన దొంగతనం కేసు విచారణ చేస్తున్నా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ”దొంగ.. కవి నారాయణ్ సూర్వే అభిమాని అని తెలిసింది. తప్పకుండా అతను వెనుకబడిన సామాజివర్గానికి చెందిన వాడని భావిస్తున్నాం.. దొంగ వేలిముద్రలు, సిసిటీవి వీడియో ఆధారంగా విచారణ కొనసాగుతోంది. త్వరలోనే అతడిని పట్టుకుంటాం,” అని మీడియాకు తెలిపారు.