New Team India T20I Captaincy: శ్రీలంక పర్యటన బీసీసీఐకు పెద్ద సమస్యనే తీసుకొచ్చింది. రోహిత్ శర్మ ముందు రానని చెప్పడంతో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా బీసీసీఐ అనుకుంది. అయితే తర్వాత తను వస్తానని అంటున్నాడు. దీంతో కెప్టెన్సీ మళ్లీ తనకే ఇవ్వాల్సి వస్తోంది. మరోవైపు టీ 20కి సూర్యాకి ఇవ్వాలని బీసీసీఐ మనసులో ఉంది. మొన్నటి వరకు వన్డేలకు పాండ్యాకిచ్చి, టీ 20కి సూర్యాకి ఇవ్వాలని అనుకున్నారు. కానీ రోహిత్ రావడంతో పాండ్యా కెప్టెన్సీకి బ్రేకులు పడనున్నాయని అంటున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. రోహిత్ వన్డేలు తీసుకుంటే, మరి టీ 20 కెప్టెన్సీని పాండ్యాకి ఇవ్వడంలో వచ్చిన ఇబ్బంది ఏముంది? మొన్నటే టీ 20 ప్రపంచకప్ గెలిపించడంలో తను కీలకపాత్ర పోషించాడు కదా.. అని కొందరు అంటున్నారు. కానీ ఇక్కడే చిన్న మెలిక పడింది.
అదేమిటంటే కొత్తగా వచ్చిన కోచ్ గంభీర్ మాత్రం టీ 20 వరకు సూర్యాకు కెప్టెన్సీ ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాడంట. పాండ్యా మీద నాకెటువంటి ద్వేషం లేదు. పనిభారంతో ఎక్కువ సెలవులు పెట్టే పాండ్యా కెప్టెన్ గా ఉంటే, తాను అనుకున్న రీతిలో ప్రణాళికలు అమలుచేయలేనని అంటున్నాడని తెలిసింది.
నేను ఇలా చేయాలని ఏదైనా చెబితే, అది అమలుచేయడానికి కెప్టెన్ అందుబాటులో ఉండాలి కదా… అని అంటున్నట్టు సమాచారం. వీఐపీలా మ్యాచ్ టైమ్ కి వచ్చి, తన ఆట ఆడేసి, గ్రౌండ్ లో కెప్టెన్ గా షో చేసి వెళ్లేవాళ్లు వద్దని అంటున్నాడని తెలిసింది. అయితే గంభీర్ మాటలతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా ఏకీభవించినట్టు సమాచారం.
మొదట్లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా నలుగురు శ్రీలంక టూర్ కి రాలేమని అన్నారు. కానీ కోచ్ గంభీర్ మాత్రం సీనియర్లు అందుబాటులో ఉండాల్సిందేనని పట్టుబట్టాడంట. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి బాధ్యతగా భావించి వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ వ్యవహారం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read: జైషా.. ఐసీసీ ఛైర్మన్ అవుతాడా?
ఇదిలా ఉండగా మధ్యలో ట్విస్ట్ ఏమిటంటే.. హార్దిక్ పాండ్యా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కి అందుబాటులో ఉండలేనని తెలిపాడు. టీ 20 సిరీస్ కి ఉంటానని అన్నాడు. దీంతో వ్యవహారం మరింత ముదిరిపోయింది. మరికాసేపట్లో జట్టుని ప్రకటించనున్నారు. మరి సమస్యనెలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.